LOADING...
Telangana: ఉత్తర తెలంగాణ ప్రయాణానికి మరింత వేగం.. ఎన్‌హెచ్‌-44 అనుసంధాన ప్రాజెక్టులు వేగవంతం
ఉత్తర తెలంగాణ ప్రయాణానికి మరింత వేగం.. ఎన్‌హెచ్‌-44 అనుసంధాన ప్రాజెక్టులు వేగవంతం

Telangana: ఉత్తర తెలంగాణ ప్రయాణానికి మరింత వేగం.. ఎన్‌హెచ్‌-44 అనుసంధాన ప్రాజెక్టులు వేగవంతం

వ్రాసిన వారు Moogati Shabari
Jul 05, 2026
09:10 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలకు వేగవంతమైన రాకపోకలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన రెండు కీలక ఎలివేటెడ్ కారిడార్‌ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల నుంచి నగర శివార్లకు చేరుకోవడం అంత కష్టంగా లేకపోయినా, అక్కడి నుంచి నగరంలోని ప్రధాన ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరాన్ని దాటేందుకు గంట నుంచి గంటన్నర వరకు సమయం పడుతోంది.

వివరాలు

వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు..

శామీర్‌పేట, హకీంపేట మార్గాల ద్వారా సికింద్రాబాద్ వైపు ప్రయాణించే వాహనదారులు రద్దీ సమయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితికి శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం నిర్మిస్తున్న రెండు ఎలివేటెడ్ కారిడార్‌లు కీలకంగా మారనున్నాయి. ఇటీవల ఈ ప్రాజెక్టుల పనులు ప్రారంభం కావడంతో హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ ఆదేశాల మేరకు అధికారుల బృందం మీడియా ప్రతినిధులతో కలిసి శనివారం నిర్మాణ ప్రాంతాలను పరిశీలించింది. పనుల పురోగతిపై సంబంధిత నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన అధికారులు, నిర్ణయించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని సూచించారు.

వివరాలు

భూగర్భ సొరంగంతో ప్రత్యేక కారిడార్..

ప్యారడైజ్ జంక్షన్ నుంచి బాలంరాయ్ జంక్షన్, రాజీవ్‌గాంధీ విగ్రహం జంక్షన్, బేగంపేట రన్‌వే ప్రాంతం, బోయినపల్లి చెక్‌పోస్టు మీదుగా డెయిరీఫాం వరకు మొత్తం 5.3 కిలోమీటర్ల పొడవైన కారిడార్‌ను నిర్మిస్తున్నారు. ఇందులో 4.6 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ మార్గం ఉండగా, బేగంపేట విమానాశ్రయం రన్‌వే పరిధిలో విమానాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా 600 మీటర్ల పొడవైన భూగర్భ సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో పిల్లర్ల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే 20 పిల్లర్ల నిర్మాణంతో పాటు ఆరు వయాడక్ట్‌ల పనులు ప్రారంభించారు. మొత్తం పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కారిడార్ నిర్మాణం, భూసేకరణతో కలిపి ప్రభుత్వం రూ.1,487 కోట్లు వ్యయం చేస్తోంది.

Advertisement