Nvidia: భారత్ స్టాక్ మార్కెట్ కంటే ఎన్విడియా విలువ ఎక్కువ!
ఈ వార్తాకథనం ఏంటి
అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) జోరు ప్రపంచ మార్కెట్లలో కొత్త ఆర్థిక శక్తిని తీసుకొచ్చింది. ఒకప్పుడు గేమింగ్ చిప్స్కే పరిమితమైన నివిడియా ఇప్పుడు భారత్ మొత్తం ఈక్విటీ మార్కెట్ కంటే ఎక్కువ విలువను సాధించింది. ప్రస్తుతం $5.05 ట్రిలియన్ మార్కెట్ క్యాప్తో, దాదాపు $5 ట్రిలియన్ విలువ కలిగిన దలాల్ స్ట్రీట్'ను మించిపోయింది. 2023లో ఉన్న స్థాయి నుంచి మూడు సంవత్సరాల్లో దాదాపు ఐదింతలు పెరిగిన ఈ కంపెనీ, AI రంగంలో ప్రధాన బలం కావడంతో భారీగా లాభాలు నమోదు చేసింది. షేర్ ధర కూడా $50 నుంచి $211.50కి చేరి 323% పెరిగింది.
వివరాలు
$4 ట్రిలియన్ మార్కెట్ విలువను చేరుకున్న Alphabet, Apple
ఈ పెరుగుదలపై INVasset PMS బిజినెస్ హెడ్ హర్షల్ దసాని మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా AI ప్రాజెక్టులు, క్లౌడ్ సేవలు, పెద్ద లాంగ్వేజ్ మోడల్స్ కోసం అవసరమైన GPU మార్కెట్లో సుమారు 80% వాటాను ఎన్విడియా నియంత్రిస్తోందన్నారు. టెక్నాలజీ మార్పుల్లో కంప్యూటింగ్ సామర్థ్యం కీలకం అవుతే, దానిని అందించే సంస్థలు భారీ లాభాలు పొందుతాయని ఆయన చెప్పారు. ఇక AI రేసులో ఎన్విడియా ముందంజలో ఉన్నప్పటికీ, Alphabet, Apple వంటి టెక్ దిగ్గజాలు కూడా ఇటీవల $4 ట్రిలియన్ మార్కెట్ విలువను చేరుకున్నాయి. Microsoft మాత్రం ప్రస్తుతం $3 ట్రిలియన్ పైగా ట్రేడ్ అవుతోంది. అదే సమయంలో Amazon, Meta, Tesla వంటి కంపెనీలు కూడా ట్రిలియన్ డాలర్ల క్లబ్లోకి చేరాయి.
వివరాలు
భారత్ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం $5 ట్రిలియన్
ఇదిలా ఉండగా, 2024లో $5.7 ట్రిలియన్ గరిష్ట స్థాయిలో ఉన్న భారత్ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం $5 ట్రిలియన్కు పడిపోయింది. విదేశీ పెట్టుబడిదారులు భారీగా షేర్లు అమ్మడం దీనికి ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. Jefferiesకు చెందిన క్రిస్టోఫర్ వుడ్ భారత మార్కెట్ను "రివర్స్ AI ట్రేడ్"గా అభివర్ణించగా, రుచిర్ శర్మ భారత మార్కెట్లో AI అవకాశాలు తక్కువగా ఉండటం వల్ల విదేశీ పెట్టుబడిదారులు ఆసక్తి చూపడం లేదన్నారు. అలాగే, భారత ఐటీ రంగం సేవలపై ఆధారపడటం వల్ల భారీ విలువలను అందుకోలేకపోతోందని నిపుణులు చెబుతున్నారు. TCS, Infosys వంటి సంస్థలు గ్లోబల్ స్థాయిలో ముందంజలో ఉన్నప్పటికీ, వాటి వృద్ధి ఉద్యోగుల సంఖ్యపై ఆధారపడటం ఒక పరిమితిగా మారిందని విశ్లేషణ.