Oil Prices: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తత.. 5%కుపైగా పెరిగిన ముడి చమురు ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా ఇరాన్పై చేపట్టిన సైనిక దాడుల నేపథ్యంలో ప్రపంచ చమురు మార్కెట్లలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. దీంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. సోమవారం ప్రారంభ ట్రేడింగ్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 5.49 శాతం పెరిగి 75.94 డాలర్లకు చేరగా, అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ 2.84 శాతం పెరిగి బ్యారెల్కు 72.44 డాలర్ల వద్ద ట్రేడైంది. అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించిన వివరాల ప్రకారం,హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న మూడు వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ లక్ష్యాలపై సైనిక చర్య చేపట్టినట్లు తెలిపింది. ప్రపంచ చమురు రవాణాలో హోర్ముజ్ జలసంధికి అత్యంత కీలకమైన స్థానం ఉంది.
వివరాలు
ముడి చమురు, ఎల్ఎన్జీ సరఫరాపై ప్రభావం
ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే ముడి చమురులో దాదాపు ఐదో వంతు ఈ సముద్ర మార్గం ద్వారానే రవాణా అవుతుంది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో ముడి చమురు, ఎల్ఎన్జీ సరఫరాపై ప్రభావం పడొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు, ఖతార్ ప్రభుత్వం గల్ఫ్ ప్రాంతంలో మూడు వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడి చేసిందని ఆరోపించింది. వీటిలో ఖతార్కు చెందిన భారీ ఎల్ఎన్జీ ట్యాంకర్ 'అల్ రెకయ్యాత్' కూడా ఉందని తెలిపింది. డ్రోన్ దాడి కారణంగా నౌక ఇంజిన్ గదిలో అగ్నిప్రమాదం సంభవించినట్లు సమాచారం. అయితే సిబ్బంది సురక్షితంగా ఉండగా, వారిని తరలించే చర్యలు కొనసాగుతున్నాయి.
వివరాలు
దెబ్బతున్న సౌదీ అరేబియా జెండాతో ప్రయాణిస్తున్న ముడి చమురు ట్యాంకర్ 'వెడియాన్'
అదే సమయంలో ఒమన్ తీరానికి సమీపంలో సౌదీ అరేబియా జెండాతో ప్రయాణిస్తున్న భారీ ముడి చమురు ట్యాంకర్ 'వెడియాన్' కూడా దెబ్బతిన్నట్లు సముద్ర భద్రతా వర్గాలు వెల్లడించాయి. అయితే ఆ నౌకకు నష్టం ఎలా జరిగిందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. హోర్ముజ్ జలసంధి ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా దేశాలకు ముడి చమురు,శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల రవాణాకు అత్యంత కీలకమైన మార్గం. ఈ మార్గంలో అంతరాయం ఎక్కువ కాలం కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా తగ్గడంతో పాటు రవాణా వ్యయాలు కూడా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రాంతంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశంపై ఇంధన మార్కెట్లు అప్రమత్తంగా ఉన్నాయి.
వివరాలు
దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా ఒత్తిడి
ఈ పరిణామాలు భారత్పైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. ముడి చమురు ధరలు పెరగడం వల్ల దిగుమతి వ్యయం అధికమై వాణిజ్య లోటు పెరిగే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల కొనసాగితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా ఒత్తిడి పెరగవచ్చు. ప్రస్తుతం భారత్ తన ముడి చమురు అవసరాల్లో 85 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతున్నందున అంతర్జాతీయ ధరల పెరుగుదల దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.