Oil prices: ట్రంప్ అల్టిమేటం ఎఫెక్ట్.. ప్రపంచవ్యాప్తంగా పెరిగిన చమురు ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు విధించిన గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆసియా మార్కెట్లలో మంగళవారం చమురు ధరలు భారీగా పెరిగాయి. ప్రపంచ ప్రామాణికమైన బ్రెంట్ క్రూడ్ ధర సుమారు 1.4% పెరిగి బ్యారెల్కు 111.33 డాలర్లకు చేరుకోగా, అమెరికాలో ట్రేడ్ అయ్యే చమురు ధర 2.8% పెరిగి 115.61 డాలర్లకు చేరింది. ముఖ్యంగా కీలకమైన హార్ముజ్ జలసంధి మార్గాన్ని తెరవాలంటూ ట్రంప్ ఇరాన్పై ఒత్తిడి పెంచడం వల్ల మార్కెట్లు ఆందోళనకు గురయ్యాయి. సోమవారం ట్రంప్, మంగళవారం రాత్రి 8 గంటల (వాషింగ్టన్ డీసీ సమయం) లోపు ఒప్పందానికి రాకపోతే ఇరాన్పై "ఒక రాత్రిలోనే చర్యలు తీసుకుంటాం" అని హెచ్చరించారు. అయితే ఇరాన్ నాయకత్వం తాత్కాలిక కాల్పుల విరమణ ప్రతిపాదనలను తిరస్కరించింది.
వివరాలు
హోర్ముజ్ జలసంధిలో నౌకా రవాణాకు అంతరాయం
యుద్ధానికి పూర్తిగా ముగింపు, ఆంక్షల ఎత్తివేత ఉంటేనే ఒప్పందానికి సిద్ధమని ఇరాన్ తెలిపింది. ఇదిలా ఉండగా, హోర్ముజ్ సముద్ర మార్గంలో రవాణా అంతరాయం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ప్రపంచ చమురు, వాయువు సరఫరాలో దాదాపు 20% ఈ మార్గం ద్వారానే జరగడం వల్ల పరిస్థితి తీవ్రంగా మారింది. ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాలపై అధికంగా ఆధారపడే జపాన్, దక్షిణ కొరియా వంటి ఆసియా దేశాలు ఈ ప్రభావాన్ని ఎక్కువగా ఎదుర్కొంటున్నాయి. దీంతో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.