Oil Prices: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై ఆశలు.. భారీగా పడిపోయిన చమురు ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలపై ప్రపంచ మార్కెట్లలో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పడిపోయాయి. మరోవైపు ఆసియా స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్లాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో ఒప్పందం దాదాపు పూర్తైందని ప్రకటించడం మార్కెట్లకు ఊరటనిచ్చింది. సోమవారం ఆసియా మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ ధర 5.5 శాతం పడిపోయి బ్యారెల్కు 97.90 డాలర్లకు చేరింది. అమెరికాలో ట్రేడ్ అయ్యే క్రూడ్ ఆయిల్ ధర కూడా 5.9 శాతం తగ్గి 90.93 డాలర్ల వద్దకు వచ్చింది. గత కొన్ని నెలలుగా యుద్ధ ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు శాంతి చర్చలతో మార్కెట్లు కొంత స్థిరపడుతున్నాయి.
వివరాలు
హోర్ముజ్ జలసంధి తెరుచుకునే అవకాశం
ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హార్ముజ్ జలసంధి మళ్లీ తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలో దాదాపు ఐదో వంతు చమురు, ఎల్ఎన్జీ రవాణా ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ మార్గం దాదాపు మూసివేయబడింది. జపాన్ మార్కెట్లలో జోష్ ఈ పరిణామాలతో జపాన్కు చెందిన Nikkei 225 సూచీ 3 శాతం ఎగిసి 65 వేల మార్క్ను తొలిసారి దాటింది. గల్ఫ్ దేశాలపై అధికంగా ఆధారపడే జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలకు ఈ వార్తలు ఊరటనిస్తున్నాయి.
వివరాలు
ట్రంప్ వ్యాఖ్యలు కీలకం
సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్ నాయకులతో చర్చలు జరిపినట్లు ట్రంప్ వెల్లడించారు. "శాంతికి సంబంధించిన అవగాహన ఒప్పందం దాదాపు సిద్ధమైంది" అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అలాగే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కూడా మాట్లాడినట్లు తెలిపారు. అయితే ఆదివారం మాత్రం "త్వరపడకుండా సరైన ఒప్పందం కావాలి. ఎలాంటి తప్పులు జరగకూడదు" అంటూ ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. ఇరాన్ స్పందన ఇదే ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బకాయి మాట్లాడుతూ.. గత వారం నుంచి అమెరికా-ఇరాన్ అభిప్రాయాలు దగ్గరయ్యాయని తెలిపారు. కానీ కీలక అంశాలపై ఇంకా తుది ఒప్పందం కాలేదని స్పష్టం చేశారు.
వివరాలు
ఇంకా ఒత్తిడిలోనే చమురు మార్కెట్
ప్రస్తుతం ధరలు తగ్గినా.. యుద్ధానికి ముందు ఉన్న స్థాయికి మాత్రం ఇంకా చేరలేదు. యుద్ధానికి ముందు బ్రెంట్ చమురు ధర బ్యారెల్కు సుమారు 70 డాలర్ల వద్ద ఉండేది. చమురు సరఫరా పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి ఇంకా సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ఎంఎస్టీ ఫైనాన్షియల్ ఎనర్జీ రీసెర్చ్ హెడ్ సౌల్ కావోనిక్ మాట్లాడుతూ.. "ఇప్పుడు పరిస్థితుల్లో కొంత ఆశ కనిపిస్తోంది. అయితే చమురు సరఫరా పూర్తిగా కోలుకోవడానికి, దెబ్బతిన్న మౌలిక వసతులు పునరుద్ధరించడానికి 2027 వరకు సమయం పట్టొచ్చు" అని తెలిపారు.