Oil Prices: యుద్ధ విరామ ప్రభావం.. ఒక్కరోజే 7% పడిపోయిన అంతర్జాతీయ చమురు ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
యుద్ధ విరామం ప్రభావంతో అంతర్జాతీయ ముడి చమురు ధరలు సోమవారం ఒక్కరోజే భారీగా క్షీణించాయి. అమెరికా-ఇరాన్ మధ్య వారాంతంలో సైనిక దాడులు నిలిచిపోవడంతో మార్కెట్లో ఉద్రిక్తతలు తగ్గుతాయనే అంచనాలు బలపడ్డాయి. దీంతో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర దాదాపు 7 శాతం మేర పడిపోగా, అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) చమురు ధర కూడా అదే స్థాయిలో క్షీణించింది. ఫలితంగా గత మూడు వారాలుగా కొనసాగుతున్న చమురు ధరల భారీ ర్యాలీకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇరాన్పై అమెరికా నుంచి కొత్త దాడులు జరగనంత వరకు తాము కూడా సైనిక చర్యలకు దిగబోమని తెహ్రాన్ సంకేతాలు ఇవ్వడంతో మార్కెట్లో సానుకూల వాతావరణం ఏర్పడింది.
వివరాలు
డబ్ల్యూటీఐ ధర 85డాలర్ల దిగువకు..
ఈ పరిణామాల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు సుమారు 91డాలర్ల వద్దకు చేరుకోగా, డబ్ల్యూటీఐ ధర 85డాలర్ల దిగువకు పడిపోయింది.
కాగా,గతవారం హర్మూజ్ జలసంధి,బాబ్ ఎల్ మండెబ్ సముద్ర మార్గాల్లో చమురు సరఫరాలకు అంతరాయం ఏర్పడుతుందనే ఆందోళనలతో బ్రెంట్ ధర 100డాలర్ల మార్కును దాటిన విషయం తెలిసిందే.
అయితే పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి చేరిందని చెప్పలేమని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎర్ర సముద్రంలోని సౌదీ అరామ్కో చమురు కేంద్రాలపై హౌతీ తిరుగుబాటుదారులు కొనసాగిస్తున్న దాడులు మధ్యప్రాచ్య ప్రాంతంలో భౌగోళిక ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయనే సంకేతాలు ఇస్తున్నాయని వారు పేర్కొంటున్నారు.
అలాగే ప్రపంచ చమురురవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి మీదుగా నౌకలరాకపోకలు కూడా ఇంకా పూర్తిగా సాధారణ స్థితికి చేరుకోలేదని గుర్తుచేస్తున్నారు.