RBI Re-KYC Rules: రీ-కేవైసీ గడువు పొడిగించండి.. ఆర్బీఐని కోరిన పేమెంట్ సంస్థలు
ఈ వార్తాకథనం ఏంటి
డిజిటల్ చెల్లింపుల్లో పారదర్శకత పెంచడం, ఆర్థిక నేరాలకు అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకొచ్చిన రీ-కేవైసీ నిబంధనలు ఇప్పుడు దేశీయ ఫిన్టెక్ రంగానికి కొత్త సవాళ్లు సృష్టిస్తున్నాయి. పేమెంట్ అగ్రిగేటర్ల వద్ద నమోదైన పాత వ్యాపారులందరి కేవైసీని పూర్తి చేసేందుకు ఆర్బీఐ విధించిన సెప్టెంబరు 15 గడువు దగ్గరపడుతుండటంతో ఫిన్టెక్ సంస్థల్లో ఆందోళన పెరుగుతోంది.
వివరాలు
లావాదేవీలు నిలిచిపోయే ప్రమాదం
గడువులోగా వ్యాపారుల వివరాలను నవీకరించకపోతే వారి డిజిటల్ లావాదేవీలు నిలిచిపోయే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
చిన్న స్థాయి క్యూఆర్ కోడ్ వ్యాపారుల్లో దాదాపు 30-35శాతం మంది ఈ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయలేకపోవచ్చని అంచనా వేస్తున్నారు.
ఆన్లైన్లో సేవలు అందిస్తున్న సుమారు 10లక్షల మంది మైక్రో వ్యాపారులు కూడా ఇదే సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
గత ఏడాది ఆర్బీఐ జారీ చేసిన మాస్టర్ డైరెక్షన్స్ ప్రకారం ఆన్లైన్,ఫిజికల్(ఆఫ్లైన్),క్రాస్బోర్డర్ పేమెంట్ అగ్రిగేటర్లు తమ వద్ద నమోదైన వ్యాపారుల వివరాలను సమగ్రంగా పునపరిశీలించాలి.
అయితే వీధివ్యాపారులు,చిన్న కిరాణా దుకాణాల నిర్వాహకుల వద్ద అధికారిక వ్యాపార ధ్రువీకరణ పత్రాలు అందుబాటులో లేకపోవడం పేమెంట్ సంస్థలకు ప్రధాన సమస్యగా మారింది.
వివరాలు
సొంత సిబ్బందితోనే కేవైసీ..
కేవైసీ ప్రక్రియలో థర్డ్పార్టీ ఏజెన్సీల సేవలను వినియోగించకుండా సంస్థల సొంత సిబ్బందినే ఉపయోగించాలని ఆర్బీఐ ఆదేశించింది.
దీంతో పేటీఎం,ఫోన్పే,గూగుల్ పే వంటి డిజిటల్ పేమెంట్ సంస్థలపై అదనపు నిర్వహణ భారం పడింది.
లక్షలాది మంది వ్యాపారులను క్షేత్రస్థాయిలో నేరుగా కలిసి వారి వివరాలను పరిశీలించడం, భౌతికంగా ధ్రువీకరించడం చాలా కష్టమైన ప్రక్రియగా మారిందని పేమెంట్ సంస్థల నిర్వాహకులు చెబుతున్నారు.
సౌండ్బాక్స్ వ్యాపారుల్లో వేగంగా..
సౌండ్బాక్స్ వినియోగించే వ్యాపారుల్లో రీ-కేవైసీ ప్రక్రియ 85-90శాతం వరకు పూర్తయినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
అయితే చిన్న క్యూఆర్ కోడ్ వ్యాపారులు,అంటే మైక్రో మర్చంట్ల కేవైసీ మాత్రం నెమ్మదిగా కొనసాగుతోంది.
ముఖ్యంగా చిన్న వ్యాపారుల వద్ద అవసరమైన అధికారిక పత్రాలు లేకపోవడం ఈ ప్రక్రియను మరింత క్లిష్టతరం చేస్తోంది.
వివరాలు
నిబంధనల్లో సడలింపులు కోరుతున్న వ్యాపారులు
డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను సురక్షితంగా ఉంచేందుకు కేవైసీ నిబంధనలు అవసరమేనని పరిశ్రమ వర్గాలు అంగీకరిస్తున్నాయి.
అయితే క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, చిన్న వ్యాపారుల వద్ద పత్రాల కొరత వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాయి.
సెప్టెంబరు 15 గడువును మరికొంతకాలం పొడిగించడంతో పాటు, అవసరమైన చోట నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలని డిజిటల్ చెల్లింపుల రంగంలోని వ్యాపారులు ఆర్బీఐని కోరుతున్నారు.