Nirmala Sitharaman: ఊహించని స్థాయికి ఎరువుల ధరలు.. మూడు 'ఎఫ్'లపై దృష్టి పెట్టాలి: నిర్మలా సీతారామన్
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు, అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావంతో ప్రపంచ మార్కెట్లు ఒత్తిడిలోకి వెళ్లాయని, ఈ పరిస్థితుల్లో భారత్ మూడు 'ఎఫ్'లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆమె అన్నారు. అవి ఫ్యూయల్ (ఇంధనం), ఫర్టిలైజర్ (ఎరువులు), ఫారెక్స్ (విదేశీ మారక నిల్వలు) అని పేర్కొన్నారు.
వివరాలు
ఇంధన ధరలు మళ్లీ పెంపు
ముంబైలో జరిగిన SIDBI 37వ వార్షికోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన నిర్మలా సీతారామన్.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతున్నాయని చెప్పారు. గత రెండు వారాల్లో నాలుగోసారి ఇంధన ధరలు పెరిగాయని, కేవలం 11 రోజుల్లోనే పెట్రోల్ ధర లీటరుకు రూ.7.38 పెరిగిందని తెలిపారు. హోర్ముజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాల వల్ల ముడి చమురు సరఫరా ప్రభావితమైందని చెప్పారు. భారత్ తన అవసరాల్లో దాదాపు 85 నుంచి 90 శాతం వరకు ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నందున ఈ ప్రభావం ఎక్కువగా పడుతోందన్నారు.
వివరాలు
విదేశీ మారక నిల్వల సంరక్షణ అవసరం
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల విదేశీ మారక నిల్వలను కాపాడాలని చేసిన పిలుపు ఇప్పుడు చాలా ముఖ్యమైందని సీతారామన్ వ్యాఖ్యానించారు. అవసరం లేని దిగుమతులను తగ్గించడం, అనవసర విదేశీ ప్రయాణాలను వాయిదా వేయడం, ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు తగ్గించడం వంటి చర్యలు తీసుకోవాలని ప్రధాని సూచించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
వివరాలు
ఎరువుల ధరలు ఊహించని స్థాయిలో..
కేవలం ఇంధన ధరలే కాదు.. ఎరువుల ధరలు కూడా ఊహించని స్థాయికి చేరాయని ఆర్థిక మంత్రి తెలిపారు. అంతేకాదు, బంగారం ధరలు భారీగా పెరగడం వల్ల కూడా దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతోందన్నారు. ముడి చమురు ధరలు దీర్ఘకాలం పెరిగితే దేశ కరెంట్ అకౌంట్ లోటు మరింత పెరిగే అవకాశం ఉందని, రూపాయి విలువ బలహీనపడవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల డాలర్కు రూపాయి విలువ 97 మార్క్కు దగ్గరగా వెళ్లిందని చెప్పారు.
వివరాలు
మధ్యప్రాచ్య సంక్షోభం ప్రభావం భారీగా ఉంటుంది
మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు కేవలం రాజకీయ సమస్య కాదని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇంధన వ్యయం పెరగడం, సరుకు రవాణా ఆలస్యం, షిప్పింగ్ ఖర్చులు పెరగడం, ముడి పదార్థాల కొరత, ఎగుమతి ఆర్డర్లలో అనిశ్చితి వంటి అనేక సమస్యలు వ్యాపారాలు, సామాన్య ప్రజలపై ప్రభావం చూపుతాయని చెప్పారు. దేశ ఆర్థిక పరిస్థితిని కొందరు కావాలనే ప్రతికూలంగా చూపిస్తున్నారని నిర్మలా సీతారామన్ విమర్శించారు. భారత్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ బలంగా, స్థిరంగా ఉందని స్పష్టం చేశారు. సాధారణ ప్రజలు సాధిస్తున్న విజయాలను విస్మరించి, నిరాశావాద ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భయాందోళనలు సృష్టించే వ్యాఖ్యలను భారత్ భరించలేదని, ప్రజల్లో నమ్మకం పెంచేలా మాటలు, చర్యలు ఉండాలని ఆమె పేర్కొన్నారు.
వివరాలు
ఇంధన పన్నులు తగ్గించి భారీ భారం మోస్తున్న కేంద్రం
పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గించడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి రూ.1లక్ష కోట్లకు పైగా ఆదాయ నష్టం వస్తోందని సీతారామన్ వెల్లడించారు. వినియోగదారులపై మరింత భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. MSME రంగంపై ఒత్తిడి దేశంలోని సూక్ష్మ,చిన్న,మధ్య తరహా పరిశ్రమల(MSME)రంగం కూడా ఒత్తిడిని ఎదుర్కొంటోందని మంత్రి తెలిపారు. రూ.8.1లక్షల కోట్ల చెల్లింపులు పెండింగ్లో ఉండటం వల్ల వర్కింగ్ క్యాపిటల్పై ప్రభావం పడుతోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు 45 రోజుల్లోపు MSME బకాయిలు చెల్లించేలా చూడాలని సూచించారు. అయితే గ్లోబల్ అనిశ్చితుల మధ్య కూడా GST వసూళ్లు పెరగడం,దేశీయ డిమాండ్ బలంగా ఉండటం, ప్రైవేట్ పెట్టుబడులు మెరుగుపడటం వంటి అంశాలు భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతోందని సూచిస్తున్నాయని నిర్మలా సీతారామన్ అన్నారు.