Page Loader
Ratan Tata's will: రూ.3800 కోట్లు ఛారిటీకే.. రతన్ టాటా వీలునామాలో ఎవరికి ఎంత ఇచ్చారో తెలుసా?
రూ.3800 కోట్లు ఛారిటీకే.. రతన్ టాటా వీలునామాలో ఎవరికి ఎంత ఇచ్చారో తెలుసా?

Ratan Tata's will: రూ.3800 కోట్లు ఛారిటీకే.. రతన్ టాటా వీలునామాలో ఎవరికి ఎంత ఇచ్చారో తెలుసా?

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 01, 2025
04:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

దివంగత పారిశ్రామికవేత్త రతన్‌ టాటా (Ratan Tata) కేవలం లక్షల కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగానే కాకుండా,ఒక గొప్ప మానవతామూర్తిగా,సమాజ సేవకుడిగా కూడా ప్రసిద్ధిచెందారు. టాటా వారి గొప్ప వారసత్వం ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిఉన్నది, టాటా గ్రూప్‌ను కార్పొరేట్‌ ప్రపంచంలో అత్యంత కీలకమైన సంస్థగా మార్చిన వ్యక్తిగా రతన్‌ టాటా నిలిచారు. గత ఏడాది అక్టోబరు 9న ఆయన అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. రతన్‌ టాటా మరణం తరువాత,ఆయన ఆస్తుల్లో దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన వాటి కేటాయింపు గురించి చాలా చర్చలు జరిగాయి. అవి తన స్థాపించిన ఫౌండేషన్‌లకు, సోదరుడు జిమ్మీ టాటాకు, సిబ్బంది, ఇతరులకు కేటాయించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

వివరాలు 

ఛారిటీకి రూ.3800 కోట్ల 

తాజాగా, దీనికి సంబంధించి మరొక కథనం వెలుగులోకి వచ్చింది. రతన్‌ టాటా తన ఆస్తుల సింహభాగాన్ని చారిటీకి కేటాయించారని వార్తలు వస్తున్నాయి. ఇక, వీలునామాలో ఆయన ఎవరికి ఎంత ఇచ్చారో తెలుసా? రతన్‌ టాటా తన ఆస్తుల్లో దాదాపు రూ.3800 కోట్ల విలువైన సంపదను తన స్థాపించిన రతన్‌ టాటా ఎండోమెంట్‌ ఫౌండేషన్‌,ఎండోమెంట్‌ ట్రస్ట్‌కు కేటాయించినట్లు తాజా కథనం పేర్కొంది. ఇందులో టాటా సన్స్‌లో తనకున్న షేర్లు, ఇతర ఆస్తులు ఉన్నాయి. ఈ షేర్లను విక్రయించే అవసరం వస్తే, టాటా సన్స్‌లోని ప్రస్తుతం ఉన్న వాటాదారులకే వాటిని అమ్మాలని ఆయన వీలునామాలో సూచించారని సమాచారం.

వివరాలు 

కుటుంబం, సన్నిహతులకు మెజార్టీ వాటా 

ఆయన సవతి సోదరీమణులు శిరీన్‌ జజీభోయ్‌, దియానా జజీభోయ్‌లకు రూ.800 కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. ఇందులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, స్టాక్స్‌, ఖరీదైన గడియారాలు, పెయింటింగ్స్‌ వంటి విలువైన వస్తువులు ఉన్నాయి. టాటా గ్రూప్‌ మాజీ ఉద్యోగి, రతన్‌ టాటాకు అత్యంత సన్నిహితుడు అయిన మోహిన్‌ ఎం దత్తాకు కూడా రూ.800 కోట్లు విలువైన ఆస్తులు కేటాయించినట్లు సమాచారం. జుహూలోని తన బంగ్లాలో కొన్ని షేర్లు, వెండి వస్తువులు, బంగారు ఆభరణాలను సోదరుడు జిమ్మీ నావల్‌ టాటాకు కేటాయించారు. అలీబాగ్‌లోని బంగ్లా,మూడు పిస్టోల్స్‌ను తన ప్రియ మిత్రుడు మెహిల్‌ మిస్త్రీకి వేశారు.

వివరాలు 

శునకాల సంరక్షణకు ప్రత్యేక నిధి 

రతన్‌ టాటాకు మూగజీవాలపై ఎంతో ప్రేమ ఉండేది. వీధి శునకాల సంరక్షణ కోసం ఆసుపత్రులు కూడా స్థాపించారు. ఆయన వీలునామాలో ఈ పెంపుడు జంతువులను కూడా మర్చిపోలేదు. వాటి సంరక్షణ కోసం 12 లక్షల రూపాయల ఫండ్‌ను సమకూర్చి, ప్రతి త్రైమాసికం లో రూ.30వేల చొప్పున ఈ నిధిని వినియోగించాలనుకున్నారు. యువ మిత్రుడికి సాయం రతన్‌ టాటా జీవితంలో అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి శంతను నాయుడు (Shantanu Naidu). ఈ యువమిత్రుడికి ఆయన తనవంతు సాయం చేశాడు. శంతనుకు ఇచ్చిన విద్యార్థి రుణాన్ని మాఫీ చేశాడు. అలాగే, తన పొరుగింట్లో ఉన్న జేక్‌ మాలిటే అనే వ్యక్తికి రూ.23 లక్షలు అప్పుగా ఇచ్చి, దాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు వీలునామాలో పేర్కొన్నారు.

వివరాలు 

విదేశాల్లో ఆస్తులు 

వీలునామా ప్రకారం, రతన్‌ టాటాకు విదేశాల్లో రూ.40 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. సీషెల్స్‌లో భూములు, మోర్గాన్‌ స్టాన్లీ, వెల్స్‌ ఫార్గో వంటి ఆర్థిక సంస్థల్లో బ్యాంకు ఖాతాలు, అల్కోవా కార్పొరేషన్‌, హౌమెట్‌ ఏరోస్పేస్‌ వంటి కంపెనీల్లో షేర్లు ఉన్నాయి. ఆయన వద్ద ప్రముఖ బ్రాండ్లకు చెందిన 65 ఖరీదైన చేతిగడియారాలు కూడా ఉన్నాయి. వీలునామా తేది ఈ వీలునామాను 2022 ఫిబ్రవరి 23న రాసినట్లు కథనం పేర్కొంది. ఇది పరిశీలించి, ఆస్తుల కేటాయింపుల ప్రక్రియకు సంబంధించి బాంబే హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఆ ప్రక్రియ పూర్తి కావడానికి మరిన్ని ఆరు నెలలు పడతాయని వెల్లడించారు.