RBI: పాలిమర్ నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన.. 2028 నాటికి పాలిమర్ కరెన్సీ నోట్లు..
ఈ వార్తాకథనం ఏంటి
భారత్లో పాలిమర్ కరెన్సీ నోట్లను 2028 ఆర్థిక సంవత్సరం నాటికి చలామణిలోకి తీసుకురావడమే లక్ష్యంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బి ఐ) చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఈ నోట్లపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరీక్షలు కొనసాగుతున్నాయని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ద్రవ్య విధాన సమీక్ష సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, పాలిమర్ నోట్లను ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావడానికి ముందు వాటి పనితీరును అన్ని కోణాల్లో పరిశీలిస్తామని తెలిపారు. క్షేత్రస్థాయి పరీక్షల ఫలితాలను సమగ్రంగా విశ్లేషించిన తర్వాతే దేశవ్యాప్తంగా చలామణిపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
వివరాలు
నకిలీ నోట్ల తయారీని అరికట్టడంలో కూడా పాలిమర్ కరెన్సీ సమర్థవంతంగా ఉపయోగపడే అవకాశం
ఇటీవల రూ.10, రూ.20 విలువైన పాలిమర్ నోట్లపై పైలట్ ప్రాజెక్టు నిర్వహించేందుకు ఆర్బీఐ చేసిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఈ ప్రాజెక్టులో భాగంగా ఒక్కో విలువలో 100 కోట్ల నోట్లను విడుదల చేసి, అవి ఎంతకాలం మన్నుతాయి, భారతదేశంలోని భిన్న వాతావరణ పరిస్థితులకు ఎంత మేర అనుకూలంగా ఉంటాయనే అంశాలను పరిశీలించనున్నారు.
సాంప్రదాయ కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు ఎక్కువకాలం మన్నికగా ఉండటమే కాకుండా, ప్రత్యేక పారదర్శక విండోలు, అధునాతన భద్రతా ఫీచర్లతో రూపొందించబడతాయని ఆర్బీఐ పేర్కొంది.
ఈ ప్రత్యేకతల వల్ల నకిలీ నోట్ల తయారీని అరికట్టడంలో కూడా ఇవి సమర్థవంతంగా ఉపయోగపడే అవకాశం ఉందని తెలిపింది.
వివరాలు
గితపు కరెన్సీ నోట్లను పూర్తిగా ఉపసంహరించుకునే ఆలోచన లేదు: కేంద్ర ప్రభుత్వం
అయితే పాలిమర్ నోట్లు ప్రవేశపెడుతున్నప్పటికీ ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితపు కరెన్సీ నోట్లను పూర్తిగా ఉపసంహరించుకునే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
కొత్త పాలిమర్ నోట్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా అవి కాగితపు నోట్లతోపాటు సమాంతరంగా చలామణిలో కొనసాగనున్నాయి.