Reliance Industries: బ్యాటరీ తయారీ ప్రణాళికల్లో మార్పుల్లేవు: రిలయన్స్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్కు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ బ్యాటరీ స్టోరేజ్ తయారీ ప్రణాళికల్లో ఎలాంటి మార్పు లేదని సోమవారం స్పష్టం చేసింది. చైనా టెక్నాలజీ దక్కకపోవడంతో భారత్లో లిథియం-అయాన్ బ్యాటరీ సెల్ల తయారీ ప్రణాళికలను నిలిపివేశిందని బ్లూమ్బర్గ్ న్యూస్ పేర్కొన్న కథనంపై స్పందిస్తూ ఈ ప్రకటన చేసింది. ''సెల్ నుంచి కంటైనర్ ఆధారిత ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (ESS) వరకు ప్రపంచ స్థాయి బ్యాటరీ స్టోరేజ్ తయారీ వ్యవస్థను ఏర్పాటు చేయాలనే మా ప్రణాళికల్లో ఎలాంటి మార్పు లేదు. లక్ష్య గడువుల ప్రకారమే అన్ని పనులు వేగంగా కొనసాగుతున్నాయి'' అని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధి రాయిటర్స్కు ఈమెయిల్ ద్వారా తెలిపారు.
వివరాలు
షియామెన్ వెనక్కి..
ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ ఈ ఏడాది నుంచే బ్యాటరీ సెల్ల తయారీ ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం చైనాకు చెందిన షియామెన్ హిథియం ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీ సంస్థతో సెల్ టెక్నాలజీ లైసెన్సింగ్పై చర్చలు జరిపినట్లు బ్లూమ్బర్గ్ న్యూస్ ఆదివారం వెల్లడించింది. ఈ విషయాన్ని వెల్లడించిన వారు తమ పేరు వెల్లడించకుండా ఉండాలని కోరినట్లు ఆ కథనం తెలిపింది. అయితే కీలక రంగాల్లో విదేశీ టెక్నాలజీ బదిలీలపై చైనా ఆంక్షలు విధించడంతో, ప్రతిపాదిత భాగస్వామ్యం నుంచి షియామెన్ వెనక్కి తగ్గిందని, దాంతో ఈ చర్చలు నిలిచిపోయాయని ఆ కథనం పేర్కొంది.
వివరాలు
లిథియం బ్యాటరీ భాగాల ఎగుమతులపై బీజింగ్ నియంత్రణలు
ఈ పరిణామాల నేపథ్యంలో రిలయన్స్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ల అసెంబ్లింగ్పై మరింత దృష్టి పెట్టిందని బ్లూమ్బర్గ్ తెలిపింది. ఈ కథనాన్ని రాయిటర్స్ తక్షణమే స్వతంత్రంగా నిర్ధారించలేకపోయింది. గత అక్టోబర్లో లిథియం బ్యాటరీ భాగాల ఎగుమతులపై బీజింగ్ నియంత్రణలు ప్రకటించింది. ఇకపై ఎగుమతిదారులు ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. దీంతో ఎనర్జీ స్టోరేజ్, ఎలక్ట్రిక్ వాహనాలకు కీలకమైన టెక్నాలజీపై చైనా పట్టు మరింత బలపడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.