Trump On Reliance Investment : అమెరికాలో రిలయన్స్ భారీ పెట్టుబడి.. కొత్త రిఫైనరీకి 300 బిలియన్ డాలర్ల ఒప్పందం
ఈ వార్తాకథనం ఏంటి
ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అమెరికాలో భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత అమెరికాలో కొత్తగా చమురు శుద్ధి కర్మాగారం నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందం మొత్తం విలువ 300 బిలియన్ డాలర్లుగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫాం ట్రూత్లో పోస్ట్ చేశారు. ఈ కొత్త రిఫైనరీ నిర్మాణం ద్వారా అమెరికా మార్కెట్లకు ఇంధన ఉత్పత్తి పెరగడంతో పాటు దేశ జాతీయ భద్రత మరింత బలోపేతం అవుతుందని ఆయన చెప్పారు.
వివరాలు
భారత భాగస్వామ్యానికి ట్రంప్ కృతజ్ఞతలు
"అమెరికా మళ్లీ నిజమైన శక్తి ఆధిపత్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతోంది. టెక్సాస్ రాష్ట్రంలోని బ్రౌన్స్విల్లేలో కొత్త ఆయిల్ రిఫైనరీ నిర్మాణం ప్రారంభమవుతుందని ప్రకటించడం నాకు గర్వంగా ఉంది. గత 50 ఏళ్లలో అమెరికాలో ప్రారంభమవుతున్న తొలి కొత్త రిఫైనరీ ఇదే. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద 300 బిలియన్ డాలర్ల ఒప్పందంగా నిలుస్తుంది. అమెరికన్ కార్మికులు, ఇంధన రంగం, అలాగే దక్షిణ టెక్సాస్ ప్రజలకు ఇది పెద్ద విజయంగా మారనుంది. ఈ గొప్ప పెట్టుబడికి భారత్లోని మా భాగస్వాములకు, ముఖ్యంగా అతిపెద్ద ప్రైవేట్ ఎనర్జీ కంపెనీ రిలయన్స్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అని ట్రంప్ తెలిపారు.
వివరాలు
వేలాది ఉద్యోగాలు, భారీ ఆర్థిక లాభాలు
కొత్త రిఫైనరీ నిర్మాణం వల్ల ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన లాభాలు కలుగుతాయని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది కొత్త ఉద్యోగాలు సృష్టించబడటమే కాకుండా, బిలియన్ల డాలర్ల ఆర్థిక ప్రయోజనం ఏర్పడుతుందని ఆయన చెప్పారు. అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయడం, పన్నులను తగ్గించడం వంటి "అమెరికా ఫస్ట్" విధానాల వల్లే ఇలాంటి భారీ పెట్టుబడులు దేశంలోకి వస్తున్నాయని ఆయన వివరించారు. బ్రౌన్స్విల్లే పోర్టులో నిర్మించబోయే ఈ చమురు శుద్ధి కర్మాగారం ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన రిఫైనరీగా నిలవనుందని ట్రంప్ తెలిపారు. ఇది అమెరికా మార్కెట్లకు ఇంధన సరఫరాను పెంచడమే కాకుండా దేశ జాతీయ భద్రతను బలోపేతం చేస్తుందని చెప్పారు. అంతేకాకుండా,ప్రపంచ మార్కెట్లకు ఇంధన ఎగుమతులకు కూడా ఇది తోడ్పడుతుందని వెల్లడించారు.
వివరాలు
ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం
అమెరికా-ఇజ్రాయెల్,ఇరాన్ మధ్య జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచ చమురు రవాణాలో సుమారు 20 శాతం జరిగే కీలక మార్గం అయిన హర్మూజ్ జలసంధి ప్రాంతంలో అంతరాయాలు ఏర్పడటంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడింది. ఈ పరిస్థితుల మధ్య చమురు ధరలు త్వరలోనే తగ్గే అవకాశముందని వైట్ హౌస్ కార్యదర్శి కరోలిన్ లీవిట్ తెలిపారు. ప్రస్తుతం పెరిగిన ధరలు తాత్కాలికమేనని, అమెరికా తన లక్ష్యాలను పూర్తిగా సాధించిన తర్వాత చమురు ధరలు వేగంగా తగ్గుతాయని ఆమె పేర్కొన్నారు.
వివరాలు
ఎల్పీజీ ఉత్పత్తి పెంపుకు చర్యలు: రిలయన్స్ ఇండస్ట్రీస్
ఇదిలా ఉండగా,భారత ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఎల్పీజీ ఉత్పత్తిని పెంచేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ మంగళవారం ప్రకటించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రిఫైనింగ్ కేంద్రంగా పేరుగాంచిన జామ్నగర్లోని రిఫైనరీ. పెట్రోకెమికల్ కాంప్లెక్స్లలో ఎల్పీజీ ఉత్పత్తిని పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది.
వివరాలు
భారత ఇంధన భద్రతకు మేము పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నాం: రిలయన్స్
రిలయన్స్ విడుదల చేసిన ప్రకటనలో, "ప్రపంచ ఇంధన మార్కెట్లు అస్థిరంగా ఉన్న సమయంలో భారత కుటుంబాలకు అవసరమైన ఇంధన సరఫరా నిరంతరం కొనసాగడం జాతీయ ప్రాధాన్యత. అందుకే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జామ్నగర్ రిఫైనరీ నుంచి ఎల్పీజీ ఉత్పత్తిని పెంచేందుకు మా బృందాలు 24 గంటలు పని చేస్తున్నాయి. అలాగే KG-D6 బేసిన్ నుంచి ఉత్పత్తి అయ్యే సహజ వాయువును దేశ ఇంధన అవసరాల ప్రకారం కీలక రంగాలకు మళ్లిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత ఇంధన భద్రతకు మేము పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నాం. దేశానికి అవసరమైనప్పుడు రిలయన్స్ ఎల్లప్పుడూ దేశంతోనే ఉంటుంది" అని పేర్కొంది.