Indian Rupee: విదేశీ రెమిటెన్సుల్లో భారత్ నంబర్ వన్.. పదేళ్లలో రెండున్నర రెట్లు వృద్ధి
ఈ వార్తాకథనం ఏంటి
విదేశాల్లో స్థిరపడిన భారతీయులు తమ కుటుంబాలకు, స్వదేశానికి పంపే డబ్బు (రెమిటెన్సులు) భారీగా పెరిగింది. గత దశాబ్ద కాలంలో ఈ నిధుల ప్రవాహం గణనీయంగా వృద్ధి చెందింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక రెమిటెన్సులు అందుకుంటున్న దేశంగా భారత్ అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది భారత్కు ఏకంగా 151 బిలియన్ డాలర్ల రెమిటెన్సులు వచ్చాయి. భారత కరెన్సీలో ఈ మొత్తం దాదాపు రూ.14.47 లక్షల కోట్లు. ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ (ఐఎఫ్ఏడీ) సోమవారం విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది.
వివరాలు
పదేళ్లలో రెండున్నర రెట్లు పెరుగుదల
2016లో భారత్కు వచ్చిన రెమిటెన్సుల విలువ 63 బిలియన్ డాలర్లు మాత్రమే.
అయితే పదేళ్ల వ్యవధిలో ఈ మొత్తం 151 బిలియన్ డాలర్లకు చేరింది. అంటే దాదాపు రెండున్నర రెట్లు పెరిగింది.
ఈ గణాంకాల్లో ప్రవాస భారతీయులు తమ కుటుంబాలకు వ్యక్తిగతంగా పంపే డబ్బు మాత్రమే ఉంటుందని ఐఎఫ్ఏడీ స్పష్టం చేసింది. ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు (ఎఫ్డీఐ), ఇతర సంస్థాగత నిధుల బదిలీలను రెమిటెన్సులుగా పరిగణించలేదని పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా గతేడాది అందిన మొత్తం రెమిటెన్సులు 728.6 బిలియన్ డాలర్లకు చేరినట్లు నివేదిక తెలిపింది.
వివరాలు
డిజిటల్ చెల్లింపుల వ్యవస్థతో ప్రయోజనం
భారత్లో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ బలంగా ఉండటం రెమిటెన్సుల పెరుగుదలకు ప్రధానంగా దోహదపడిందని ఐఎఫ్ఏడీ ప్రశంసించింది.
ముఖ్యంగా ఆధార్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వంటి వ్యవస్థల వల్ల లబ్ధిదారులకు డబ్బు వేగంగా, సులభంగా చేరుతోందని వివరించింది.
దేశంలో ఏర్పడిన బలమైన డిజిటల్ మౌలిక వసతులు, ఆర్థిక సేవల విస్తరణకు ఈ వృద్ధి నిదర్శనమని పేర్కొంది.
వివరాలు
కుటుంబాలకే కాదు.. ఆర్థిక వృద్ధికీ అండ
ప్రవాసులు పంపే నిధులు కేవలం కుటుంబాల ప్రాథమిక అవసరాలను తీర్చడానికే పరిమితం కావని ఐఎఫ్ఏడీ ప్రెసిడెంట్ అల్వారో లారియో అన్నారు.
ఆర్థిక వృద్ధికి, సంక్షోభ సమయాల్లో కుటుంబాలు, సమాజాలు నిలదొక్కుకోవడానికి కూడా ఈ నిధులు కీలకంగా ఉపయోగపడతాయని తెలిపారు.
అయితే సరైన ఆర్థిక సేవలు అందుబాటులో ఉన్నప్పుడే రెమిటెన్సుల ద్వారా లభించే ప్రయోజనాలు మరింత పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానంతోనూ సహకారం
ప్రవాస భారతీయులు కేవలం డబ్బు పంపడం ద్వారానే కాకుండా తమ నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం, వ్యాపార సంబంధాల ద్వారా కూడా భారత్ అభివృద్ధికి తోడ్పడుతున్నారని నివేదిక వివరించింది.
వారి అనుభవం, పరిజ్ఞానం దేశ ఆర్థిక వ్యవస్థకు పరోక్షంగా ప్రయోజనం చేకూరుస్తున్నాయని పేర్కొంది.
వివరాలు
రెమిటెన్సుల్లో గల్ఫ్ దేశాల వాటా అధికం
భారత్కు వస్తున్న రెమిటెన్సుల్లో గల్ఫ్ దేశాల వాటా అధికంగా ఉందని ఐఎఫ్ఏడీ తెలిపింది.
ఇది భారత్కు ఒకవైపు అవకాశాన్ని కల్పిస్తున్నప్పటికీ, మరోవైపు సవాలుగా కూడా మారవచ్చని హెచ్చరించింది.
గల్ఫ్ దేశాల్లో ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తే.. అక్కడ పనిచేస్తున్న భారతీయ కార్మికులు, వారి కుటుంబాలపై దాని ప్రభావం పడే అవకాశం ఉందని సూచించింది.
అయినప్పటికీ, ఇటీవలి సంక్షోభాలను తట్టుకుని రెమిటెన్సుల ప్రవాహం స్థిరంగా కొనసాగుతోందని నివేదిక పేర్కొంది.