LOADING...
Rolls Royce: భారత్‌లో భారీ పెట్టుబడులకు రోల్స్‌ రాయిస్‌ సిద్ధం.. యుద్ధ విమాన ఇంజిన్‌ తయారీకి ప్రాధాన్యం 
యుద్ధ విమాన ఇంజిన్‌ తయారీకి ప్రాధాన్యం

Rolls Royce: భారత్‌లో భారీ పెట్టుబడులకు రోల్స్‌ రాయిస్‌ సిద్ధం.. యుద్ధ విమాన ఇంజిన్‌ తయారీకి ప్రాధాన్యం 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 29, 2025
08:11 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ విమానయాన రంగం వేగంగా విస్తరిస్తుండటంతో పాటు, భారతీయ ఎయిర్‌లైన్లు ఇప్పటికే 1200కు పైగా కొత్త విమానాలకు ఆర్డర్లు ఇచ్చిన నేపథ్యంలో, అంతర్జాతీయ అగ్రగామి సంస్థలు భారత్‌లోనే తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలనే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో బ్రిటన్‌కు చెందిన ప్రముఖ విమాన ఇంజిన్‌ తయారీ సంస్థ రోల్స్‌ రాయిస్‌ కూడా భారత్‌ను కీలక మార్కెట్‌గా మలచుకోవాలని భావిస్తోంది. బ్రిటన్‌ వెలుపల తమ మూడో అతిపెద్ద మార్కెట్‌గా భారత్‌ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు సంస్థ వెల్లడించింది.

వివరాలు 

భారత్‌లో భారీ స్థాయి పెట్టుబడులకు ప్రణాళికలు 

జెట్‌ ఇంజిన్లు, నౌకాదళ ప్రొపల్షన్‌ వ్యవస్థలు, భూభాగ వాహనాల ఇంజిన్లు, ఆధునిక ఇంజినీరింగ్‌ విభాగాలు వంటి అనేక రంగాల్లో భారత్‌లో ఉన్న అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలని రోల్స్‌ రాయిస్‌ భావిస్తున్నట్లు రోల్స్‌ రాయిస్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శశి ముకుందన్‌ తెలిపారు. ఇందుకోసం భారత్‌లో భారీ స్థాయి పెట్టుబడులకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. అడ్వాన్స్‌డ్‌ మీడియం కాంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ (ఏఎంసీఏ) ప్రాజెక్టు కింద తయారు చేయనున్న యుద్ధ విమానాల కోసం తదుపరి తరం ఏరో ఇంజిన్ల అభివృద్ధే తమ ప్రధాన ప్రాధాన్యమని ముకుందన్‌ పేర్కొన్నారు. అలాగే భారత నావికాదళ యుద్ధ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే విధంగా,విద్యుత్‌ ఆధారిత ప్రొపల్షన్‌ అవసరాలను తీర్చడంలో రోల్స్‌ రాయిస్‌ కీలకంగా నిలవగలదని చెప్పారు.

వివరాలు 

యుద్ధవిమానాల ఇంజిన్‌ల తయారీకే ప్రత్యేక ప్రాధాన్యం

ఏఎంసీఏ కోసం అభివృద్ధి చేసే ఇంజిన్‌ కోర్‌ను నేవల్‌ మెరైన్‌ ఇంజిన్‌గా మార్చడంతో పాటు, విద్యుత్‌ ప్రొపల్షన్‌ అవసరాలకు కూడా ఉపయోగించవచ్చని ఆయన వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఏరో ఇంజిన్‌ను మెరైన్‌ ఇంజిన్‌గా రూపాంతరం చేయగల సామర్థ్యం ఉన్న కొద్ది సంస్థల్లో రోల్స్‌ రాయిస్‌ ఒకటని తెలిపారు. భవిష్యత్తులో యుద్ధవిమానాల ఇంజిన్‌ల తయారీకే ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని కూడా స్పష్టం చేశారు.

Advertisement

వివరాలు 

రెండు ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలతో అవగాహనా ఒప్పందాలు

ఇదే సమయంలో భారత్‌లో రక్షణ రంగం, పారిశ్రామిక వ్యవస్థలు వేగంగా విస్తరిస్తుండటంతో, గణనీయమైన పెట్టుబడులు పెట్టేందుకు సంస్థ సిద్ధమవుతోందని ముకుందన్‌ చెప్పారు. ఈ క్రమంలో రెండు ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలతో అవగాహనా ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. వాటిలో ఒకటి అర్జున్‌ ట్యాంకుల కోసం ఇంజిన్ల తయారీకి సంబంధించినదిగా,మరొకటి భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా రూపొందించే ఆధునిక కాంబాట్‌ వాహనాల ఇంజిన్ల అభివృద్ధికి సంబంధించినదిగా ఆయన తెలిపారు.

Advertisement