
July New Rules: జూలై 1 నుంచి మారే నిబంధనలు.. వినియోగదారులు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతి నెలా మొదటిగానే గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. చమురు సంస్థలు సమీక్షల ఆధారంగా ధరలను సవరించడంతో జూలై 2025లోనూ గ్యాస్ ధరల్లో మార్పులు రావొచ్చని తెలుస్తోంది. ఇక పాన్ కార్డుకు సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(CBDT)కీలక నిర్ణయం తీసుకుంది. ఇక పాన్ కార్డు పొందాలనుకునే వారు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. పాన్ కోసం ఆధార్ ఆధారిత ధృవీకరణ తప్పనిసరి అయ్యింది. రైల్వే శాఖ కూడా ఓ నిబంధనను కఠినతరం చేసింది. 2025 జూలై 15 నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం IRCTC మొబైల్ యాప్ ద్వారా ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి కావాలి. జూలై 1 నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.
Details
క్రెడిట్ కార్డు వినియోగదారులపై ప్రభావం
అదే సమయంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు గడువును CBDT పొడిగించింది. మునుపటి గడువు జూలై 31 కాగా, తాజాగా సెప్టెంబర్ 15, 2025 వరకు వాయిదా వేసింది. క్రెడిట్ కార్డుల వినియోగదారులపై కూడా ప్రభావం పడనుంది. HDFC బ్యాంక్ కొత్తగా కొన్ని ఛార్జీలను అమలు చేయనుంది. గేమింగ్ యాప్స్ లేదా వాలెట్ల ద్వారా నెలకు రూ.10,000 కంటే ఎక్కువ ఖర్చు చేస్తే 1శాతం అదనపు రుసుము విధించనున్నారు. ఇక విద్యుత్, నీరు, గ్యాస్ వంటి బిల్లుల పైన రూ.50,000 కన్నా అధికంగా చెల్లిస్తే కూడా అదనపు ఛార్జీలు ఉండొచ్చు.
Details
1శాతం అదనపు రుణం చెల్లించాల్సిందే
ఇంధన వినియోగంపై నెలవారీ ఖర్చు రూ.15వేలు అధికంగా ఉంటే 1శాతం అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా, ICICI బ్యాంక్ ఏటీఎం లావాదేవీలపై కూడా కొత్త ఛార్జీలు విధించనుంది. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు 3 సార్లు వరకు మాత్రమే ఉచిత లావాదేవీలు చేయొచ్చు. అదనంగా డబ్బు తీసుకుంటే ప్రతి ఆర్థిక లావాదేవీపై రూ.23, ఆర్థికేతర లావాదేవీపై రూ.8.50 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్పులన్నీ ప్రజల జీతం, ఖర్చు, ఆదాయం, అవసరాలపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. కాబట్టి ముందుగానే అవగాహనతో ఉండడం మంచిది.