SBI digital rupee: ఎస్బీఐ కస్టమర్ల కోసం కొత్త సదుపాయం.. ఇక యూపీఐ ద్వారా 'డిజిటల్ రూపాయి'ని పంపొచ్చు
వినియోగదారుల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)డిజిటల్ రూపీ విధానంలో నూతన సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) అని పిలువబడే డిజిటల్ రూపాయి (ఈ- రూపీ) పేమెంట్ను యూపీఐ ఇంటర్పెరాబిలిటీ ద్వారా చేసే సదుపాయాన్ని తీసుకొచ్చింది. కొత్త విధానంతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా డిజిటల్ రూపాయిలను ఒకరికొకరు పంపించుకోవచ్చు అన్నమాట. ఈ ఫీచర్ను 'ఈ- రూపాయి బై ఎస్బీఐ' యాప్ ద్వారా పొందవచ్చు. ఇప్పటికే 'ఈ రూపీ' సదుపాయాన్ని హెచ్డీఎఫ్సీ అమలు చేస్తోంది. ఆ తర్వాత కెనరా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, యెస్ బ్యాంక్ సైతం దీని అమలు చేస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఆ ఖాతాలో చేరింది.