SBI: కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చిన ఎస్బీఐ.. సడెన్గా ఛార్జీల పెంపు.. లిమిట్ దాటితే అంతే..!
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ (SBI) తన కస్టమర్లకు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ఏటీఎం లావాదేవీలపై వసూలు చేసే ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. 2025 ఫిబ్రవరి 1 తర్వాత తొలిసారి ధరలను సవరించినట్లు ఎస్బీఐ వెల్లడించింది. ఇంటర్ఛేంజ్ ఫీజులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని బ్యాంక్ స్పష్టం చేసింది. దీని వల్ల ఏటీఎం (ATM), ఆటోమేటెడ్ డిపాజిట్ కమ్ విత్డ్రాయల్ మెషిన్ (ADWM) లావాదేవీలపై వసూలు చేసే ఛార్జీలను తిరిగి లెక్కించాల్సి వచ్చిందని తెలిపింది. సవరించిన ఈ ఛార్జీలు 2025 డిసెంబర్ 1 నుంచే అమల్లోకి వస్తాయని ఎస్బీఐ పేర్కొంది. ఈ మార్పులు ప్రధానంగా సేవింగ్స్ అకౌంట్,శాలరీ అకౌంట్ ఉన్నవారిపై ప్రభావం చూపుతాయని వెల్లడించింది.
వివరాలు
ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఉపయోగించినప్పుడు.. ఛార్జీల భారం ఎక్కువ
అయితే కొన్ని ప్రత్యేక కేటగిరీల అకౌంట్ హోల్డర్లకు మాత్రం ఏటీఎం ట్రాన్సాక్షన్లపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఎస్బీఐ ఖాతాదారులు ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఉపయోగించినప్పుడు ఈ ఛార్జీల భారం ఎక్కువగా పడనుంది. అయితే నెలవారీ ఉచిత ట్రాన్సాక్షన్ల పరిమితిలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారు యథావిధిగా ఇతర బ్యాంక్ ఏటీఎంల్లో నెలకు 5 వరకు ఉచిత ఫైనాన్షియల్, నాన్-ఫైనాన్షియల్ లావాదేవీలు చేసుకోవచ్చు. బ్యాలెన్స్ చెక్ చేయడం, మినీ స్టేట్మెంట్ తీసుకోవడం, పిన్ మార్చడం, వివరాల అప్డేట్ వంటి సేవలు ఈ ఉచిత ట్రాన్సాక్షన్లలోనే కొనసాగుతాయి.
వివరాలు
ఉచిత పరిమితి దాటిన తర్వాత చేసే లావాదేవీలపై ఛార్జీలు
అయితే ఈ ఉచిత పరిమితి దాటిన తర్వాత చేసే లావాదేవీలపై ఛార్జీలు పెరిగాయి. ఇప్పుడు ఉచిత లిమిట్ తర్వాత చేసే క్యాష్ విత్డ్రాయల్కు ప్రతి ట్రాన్సాక్షన్పై రూ.23కు జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ ఛార్జీ రూ.21 ప్లస్ జీఎస్టీగా ఉండేది.అలాగే నాన్-ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు ఇప్పడు రూ.11 ప్లస్ జీఎస్టీ వసూలు చేయనున్నారు. ఇంతకుముందు ఇది రూ.10 ప్లస్ జీఎస్టీ మాత్రమే. ఎస్బీఐ శాలరీ ప్యాకేజ్ సేవింగ్స్ అకౌంట్ హోల్డర్ల విషయంలో కూడా మార్పులు అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు వీరికి ఫైనాన్షియల్, నాన్-ఫైనాన్షియల్ లావాదేవీలకు కలిపి ఎక్కడైనా నెలకు 10వరకు ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్లకు మాత్రమే అవకాశం ఉంటుంది. గతంలో ఈ అకౌంట్లకు ఎలాంటి పరిమితి లేకపోవడంతో ఛార్జీలూ ఉండేవి కాదు.
వివరాలు
ఉచిత లిమిట్ దాటితే ప్రతి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్పై రూ.23 ప్లస్ జీఎస్టీ
కానీ ఇకపై ఉచిత లిమిట్ దాటితే ప్రతి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్పై రూ.23 ప్లస్ జీఎస్టీ, నాన్-ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్పై రూ.11 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎస్బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్లపై సర్వీస్ ఛార్జీల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. అలాగే ఎస్బీఐ డెబిట్ కార్డు ఉన్నవారు ఎస్బీఐ ఏటీఎంల్లో చేసే లావాదేవీలపై కూడా ఇప్పటివరకు ఉన్న విధానమే కొనసాగుతుందని బ్యాంక్ తెలిపింది. అంతేకాదు, ఎస్బీఐ ఏటీఎంల్లో కార్డ్ లేకుండా చేసే క్యాష్ విత్డ్రాయల్ లావాదేవీలపై కూడా ఎలాంటి పరిమితులు లేదా అదనపు ఛార్జీలు లేవని స్పష్టం చేసింది.