Stock market : మూడోరోజూ నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. 25,500 దిగువకు నిఫ్టీ
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చిన ప్రతికూల సంకేతాలు, విదేశీ పెట్టుబడిదారుల విక్రయాల ఒత్తిడి కారణంగా దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా మూడో రోజూ నష్టాల్లోనే ముగిశాయి. ఉదయం భారీ నష్టాల్లో ట్రేడయిన సూచీలు.. పీఎస్యూ బ్యాంకుల షేర్లలో కొనుగోలు మద్దతు రావడంతో ఒక దశలో లాభాల్లోకి చేరినా, ఆ తరువాత మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. వారాంతంలో సూచీలకు భారీ నష్టాలు తలెత్తకుండా ఇదే కొంతమేరకు ఉపశమనం ఇచ్చింది. నిఫ్టీ 25,500 స్థాయి కంటే దిగువనే ముగిసింది. సెన్సెక్స్ శుక్రవారం 83,150.15 వద్ద (క్రితం ముగింపు 83,311.01) స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. ట్రేడింగ్ మధ్యలో ఇది 82,670.95 వరకు దిగజారగా, తరువాత కొంత కోలుకొని 83,390.11 వరకు ఎగసింది.
వివరాలు
బంగారం ఔన్సు ధర 4004 డాలర్ల వద్ద ట్రేడవుతోంది
చివరికి 94.73 పాయింట్లు తగ్గి 83,216.28 వద్ద నిలిచింది. నిఫ్టీ రూ. 17.40పాయింట్లు కోల్పోయి 25,492.30 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 88.65గా నమోదైంది. సెన్సెక్స్ 30షేర్ల సూచీలో,బ్లాక్డీల్ ప్రభావంతో భర్తీ ఎయిర్టెల్ షేరు సుమారు 4శాతం వరకు నష్టపోయింది. ఇందులోని సింగ్టెల్ తన 0.8శాతం వాటాను విక్రయించడంతో ఎయిర్టెల్ షేర్పై అమ్మకాల ఒత్తిడి పెరిగింది. టెక్ మహీంద్రా,ట్రెంట్,రిలయన్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్లు కూడా నష్టాల్లో ముగిశాయి. మరోవైపు బజాజ్ ఫైనాన్స్,టాటా స్టీల్,మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్,ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ చమురు బ్యారెల్ ధర 64 డాలర్ల వద్ద నిలకడగా ఉండగా,బంగారం ఔన్సు ధర 4004 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.