Stock market : భారీ లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు .. రూ.6 లక్షల కోట్ల ర్యాలీ..సెన్సెక్స్ 1000 పాయింట్లు పైకి
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లో (Stock market)చాలా రోజుల తర్వాత మంచి ర్యాలీ కనిపించింది. వరుసగా మూడు సెషన్లలో నష్టాలు నమోదు చేసిన సూచీలు నేడు ఉత్సాహంగా దూసుకుపోయి గణనీయమైన లాభాలతో సెషన్ను ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న సానుకూల సంకేతాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను త్వరలో తగ్గించొచ్చన్న అంచనాలు ఈ లాభాల ప్రధాన కారణాలుగా నిలిచాయి. సెన్సెక్స్ వెయ్యికి పైగా పాయింట్లు ఎగబాకగా, నిఫ్టీ 26,200 మార్కును అధిగమించింది. ఈ ర్యాలీతో సూచీలు ఆల్టైమ్ రికార్డు స్థాయిలకు మరింత చేరువయ్యాయి. మరోవైపు మదుపర్ల ఆస్తిగా గుర్తించే బీఎస్ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ ఒకే ట్రేడింగ్ సెషన్లో రూ.6 లక్షల కోట్లు పెరిగి రూ.475 లక్షల కోట్లకు చేరుకుంది.
వివరాలు
డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 89.25గా నమోదు
సెన్సెక్స్ ఉదయం 84,587.01 పాయింట్ల క్రితం ముగింపుతో పోలిస్తే స్వల్పంగా 84,503.44 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. తర్వాత క్రమంగా లాభాల దిశగా మళ్లి,రోజు మొత్తం అవే కొనసాగించింది.ఇంట్రాడేలో 85,644.19 పాయింట్ల వద్ద రోజంతా గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి 1,022 పాయింట్ల పెరుగుదలతో 85,609.51 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ కూడా 320.50 పాయింట్ల లాభంతో 26,205.30 వద్ద ముగిసింది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 89.25గా ఉంది. గతేడాది సెప్టెంబర్ 27న సెన్సెక్స్ 85,978 పాయింట్లు, నిఫ్టీ 26,277 పాయింట్ల వద్ద తమ ఆల్టైమ్ హైలను నమోదు చేశాయి. నేటి ముగింపులో రెండు సూచీలు ఆ రికార్డులకు కేవలం కొద్దిదూరంలోనే నిలిచాయి.
వివరాలు
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 62.21 డాలర్లు
సెన్సెక్స్లోని 30 కంపెనీల్లో భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్ తప్ప మిగతా అన్ని షేర్లు లాభాల్లోనే ముగిశాయి. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ఫార్మా లాంటి కంపెనీల షేర్లు గణనీయంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 62.21 డాలర్లు, బంగారం ఔన్సు ధర 4,159 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
వివరాలు
ర్యాలీ వెనుక ప్రధాన కారణాలు
డిసెంబర్ నెలలో జరగనున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు ఎక్కువయ్యాయి. తాజా ఆర్థిక డేటా కూడా ఈ అంచనాలను బలపరచడంతో, సుమారు 85 శాతం మంది అనలిస్టులు ఫెడ్ ఈసారి రేట్లు తగ్గిస్తుందని భావిస్తున్నారు. అమెరికా వడ్డీ రేట్లు తగ్గితే మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్ల వైపు అంతర్జాతీయ పెట్టుబడులు తరలివచ్చే అవకాశం ఉంటుంది. భారతీయ రిజర్వ్ బ్యాంకు (RBI) కూడా దేశీయ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందన్న అంచనాలు మార్కెట్లలో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. వాల్స్ట్రీట్లో నిన్న కొనుగోళ్లు బలంగా కనిపించాయి. వాటి ప్రభావంతో ప్రపంచ మార్కెట్లు కూడా లాభాల్లో ట్రేడవుతుండటం మన సూచీలకు మరింత మద్దతు అందించింది.
వివరాలు
ర్యాలీ వెనుక ప్రధాన కారణాలు
అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం కూడా భారత మార్కెట్లకు అనుకూలంగా మారింది. వచ్చే ఏడాదిలో క్రూడ్ సప్లై పెరుగుతుందన్న అంచనాలతో బ్రెంట్ ధర 60 డాలర్లకు కాస్త ఎగువన ట్రేడవుతోంది. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ముగింపుదశకు చేరుకుంటుందన్న అంతర్జాతీయ అంచనాలు కూడా పెట్టుబడిదారుల్లో సానుకూల భావనను పెంచాయి. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (FPIs) కూడా మళ్లీ కొనుగోళ్లలోకి దిగారు. నవంబర్ 25న వారు రూ.785 కోట్ల విలువైన ఈక్విటీలు కొనుగోలు చేయడం మార్కెట్ సెంటిమెంట్కు మరింత బలం చేకూర్చింది.