Stock Market: వరుస నష్టాల తర్వాత స్టాక్ మార్కెట్ జోష్.. 939 పాయింట్లు పైకి సెన్సెక్స్
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుస నష్టాల తర్వాత బలంగా కోలుకున్నాయి. భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ,బ్యాంకింగ్,ఫైనాన్షియల్,ఆటో,ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు చివరి గంటలో వచ్చిన బలమైన కొనుగోళ్లతో ఒక్కసారిగా పైకి ఎగిశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ తన కనిష్ఠ స్థాయిల నుంచి సుమారు 1,550 పాయింట్లు ఎగబాకగా,నిఫ్టీ కూడా ఇంట్రాడే కనిష్ఠాల నుంచి దాదాపు 2శాతం మేర పుంజుకుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్,ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, ఎస్బీఐ వంటి అధిక వెయిటేజీ కలిగిన షేర్లలో కొనుగోళ్ల ఊపు మార్కెట్కు ప్రధాన బలంగా నిలిచింది. వరుస పతనాల కారణంగా ఈ షేర్లు కనిష్ఠాలకు చేరడంతో, దీన్ని అవకాశంగా తీసుకున్న పెట్టుబడిదారులు కొనుగోళ్లకు ముందుకొచ్చారు.
వివరాలు
డాలర్తో రూపాయి మారకం విలువ 92.42గా నమోదు
సెన్సెక్స్ క్రితం ముగింపు 74,563.92 పాయింట్లతో పోలిస్తే 74,415.79 వద్ద స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. ఆరంభంలో లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీ, చివరి గంటలో మాత్రం జోరుగా దూసుకెళ్లింది. ఇంట్రాడేలో 75,805.27 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్ చివరికి 938.93 పాయింట్లు ఎగిసి 75,502.85 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 257.70 పాయింట్లు లాభపడి 23,408.80 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 92.42 వద్ద కొనసాగింది.
వివరాలు
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 104 డాలర్లు
సెన్సెక్స్ 30 షేర్ల సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎటర్నల్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. మరోవైపు బీఈఎల్, సన్ ఫార్మా, పవర్గ్రిడ్ కార్పొరేషన్, భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 104 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు ధర 4,980 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.