Shriram Finance: శ్రీరామ్ ఫైనాన్స్లో భారీ ఎఫ్డీఐ: రూ.39,168 కోట్లతో ఎంయూఎఫ్జీ బ్యాంక్ ఎంట్రీ
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్థిక సేవల రంగంలో మరో కీలకమైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (FDI) నమోదుకాబోతోంది. ప్రముఖ ఆర్థిక సంస్థ శ్రీరామ్ ఫైనాన్స్లో జపాన్కు చెందిన ఎంయూఎఫ్జీ బ్యాంక్ (MUFG Bank) భారీగా రూ. 39,168 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ పెట్టుబడికి సంబంధించిన ప్రతిపాదనకు కంపెనీ బోర్డు ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఒప్పందం ప్రకారం శ్రీరామ్ ఫైనాన్స్ తన సంస్థలోని 20 శాతం వాటాను ఎంయూఎఫ్జీ బ్యాంక్కు విక్రయించనుంది. ఈ లావాదేవీలో భాగంగా శ్రీరామ్ ఫైనాన్స్ ప్రిఫరెన్షియల్ ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. వీటి ద్వారా ఎంయూఎఫ్జీ బ్యాంక్కు కంపెనీలో 20 శాతం వాటా దక్కుతుందని శ్రీరామ్ ఫైనాన్స్ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో స్పష్టం చేసింది.
వివరాలు
డీల్ పూర్తికావాలంటే వాటాదారులు, సంబంధిత నియంత్రణ సంస్థల ఆమోదం అవసరం
ఈ ఒప్పందం భారతదేశంలో రుణాలు, ఆర్థిక సేవల రంగానికి ఉన్న భవిష్యత్ వృద్ధి అవకాశాలపై అంతర్జాతీయ స్థాయిలో ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని శ్రీరామ్ ఫైనాన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పెట్టుబడి ద్వారా సంస్థ క్యాపిటల్ బేస్ మరింత బలపడటంతో పాటు, వ్యాపార విస్తరణను వేగవంతం చేయడానికి అవకాశం ఏర్పడుతుందని తెలిపింది. అయితే, ఈ డీల్ పూర్తికావాలంటే వాటాదారులు, సంబంధిత నియంత్రణ సంస్థల ఆమోదం అవసరమని కూడా సంస్థ వెల్లడించింది. ఈ భాగస్వామ్యం టెక్నాలజీ, ఇన్నోవేషన్, కస్టమర్ ఎంగేజ్మెంట్ వంటి అంశాల్లో సుస్థిర వృద్ధికి దోహదపడుతుందని అభిప్రాయపడింది.
వివరాలు
దేశీయ ప్రైవేటు బ్యాంకులు, ఆర్థిక సంస్థలపై విదేశీ ఇన్వెస్టర్ల ఆసక్తి
ఇటీవలి కాలంలో దేశీయ ప్రైవేటు బ్యాంకులు, ఆర్థిక సంస్థలపై విదేశీ ఇన్వెస్టర్ల ఆసక్తి గణనీయంగా పెరిగింది. ఇప్పటికే పలువురు అంతర్జాతీయ సంస్థలు భారీ పెట్టుబడులు పెట్టగా, మరికొన్ని కీలక ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయి. జపాన్కు చెందిన ఎస్ఎంబీసీ (SMBC) యెస్ బ్యాంకులో 24 శాతం వాటాను దక్కించుకోగా, వార్బర్గ్ పింకస్, అబుదాబీ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ సంస్థలు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లో పెట్టుబడులు పెట్టాయి. అలాగే, ఆర్బీఎల్ బ్యాంక్లో మెజారిటీ వాటా కొనుగోలుకు ఎమిరేట్స్ ఎన్బీడీ ముందుకు రాగా, ఫెడరల్ బ్యాంక్లో న్యూయార్క్కు చెందిన బ్లాక్స్టోన్ సంస్థ 9.99 శాతం వాటా కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.