Standard Chartered: ఏఐ ప్రభావం.. 2030 నాటికి 7 వేల ఉద్యోగాలకు కోత పెట్టనున్న స్టాండర్డ్ చార్టర్డ్
ఈ వార్తాకథనం ఏంటి
లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ Standard Chartered ప్రపంచవ్యాప్తంగా 7 వేలకుపైగా ఉద్యోగాలను 2030 నాటికి తగ్గించనున్నట్లు ప్రకటించింది. లాభాలను పెంచడం, ఆటోమేషన్ను విస్తరించడం, వెల్త్ మేనేజ్మెంట్ వ్యాపారంపై ఎక్కువ దృష్టి పెట్టడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. మంగళవారం పెట్టుబడిదారులతో జరిగిన సమావేశంలో సంస్థ తన కొత్త దీర్ఘకాల వ్యూహాన్ని ప్రకటించింది. 2028 నాటికి రిటర్న్ ఆన్ ట్యాంజిబుల్ ఈక్విటీ (ROTE)ను 15 శాతానికి పైగా, 2030 నాటికి దాదాపు 18 శాతానికి తీసుకెళ్లాలని స్టాండర్డ్ చార్టర్డ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 2025 అంచనాలతో పోలిస్తే మూడు శాతం పాయింట్లకుపైగా అధికంగా ఉండనుంది.
వివరాలు
ఉద్యోగుల్లో కొందరికి కొత్త నైపుణ్యాలపై శిక్షణ
ఉద్యోగాల కోత ప్రధానంగా కార్పొరేట్, సపోర్ట్ విభాగాల్లో ఉంటుందని బ్యాంక్ తెలిపింది. బ్యాక్ ఆఫీస్ పనుల్లో ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరగడంతో ఈ మార్పులు చేపడుతున్నట్లు పేర్కొంది. 2025 జూన్ నాటికి సపోర్ట్ సర్వీసుల్లో సుమారు 51 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా స్టాండర్డ్ చార్టర్డ్ సీఈఓ Bill Winters మాట్లాడుతూ.. "ఇది కేవలం ఖర్చు తగ్గింపు చర్య కాదు. తక్కువ విలువ కలిగిన మానవ వనరుల స్థానంలో సాంకేతిక పెట్టుబడులు, ఆర్థిక మూలధనాన్ని ఉపయోగిస్తున్నాం" అని తెలిపారు. అలాగే ఉద్యోగుల్లో కొందరికి కొత్త నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చి ఇతర విభాగాల్లో అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.
వివరాలు
వెల్త్ మేనేజ్మెంట్ వ్యాపారంపై మరింత దృష్టి
ఇకపై అధిక లాభాలు వచ్చే వెల్త్ మేనేజ్మెంట్ వ్యాపారంపై మరింత దృష్టి పెట్టాలని బ్యాంక్ భావిస్తోంది. ముఖ్యంగా ధనిక రిటైల్ కస్టమర్లు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లలో తన సేవలను విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో వెల్త్ బిజినెస్ ద్వారా సంస్థ చరిత్రలోనే అత్యధిక ఆదాయం నమోదైనట్లు వెల్లడించింది.