Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. ఆల్టైమ్ కనిష్ఠానికి రూపాయి
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ ఈక్విటీ మార్కెట్ సూచీలు గురువారం నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ విపణుల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు మన స్టాక్ సూచీలపై స్పష్టంగా ప్రభావం చూపాయి. రెండు రోజుల వరుస లాభాల తర్వాత ఈ వారం చివరి సెషన్లో సూచీలు మళ్లీ నష్టాల వైపు వెళ్లాయి. దీనికి తోడు, రూపాయి బలహీనపడడం మార్కెట్ సెంటిమెంట్ను మరింత దెబ్బతీసింది. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్ఐబీ, బజాజ్ ఫైనాన్స్ షేర్లలో జరిగిన భారీ అమ్మకాలు సూచీలపై ఒత్తడిని పెంచాయి.
వివరాలు
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ఆయిల్ ధర బ్యారెల్కు 62 డాలర్లు
సెన్సెక్స్ ఉదయం 85,347.40 వద్ద నష్టాలతోనే ట్రేడింగ్ను ప్రారంభించింది (క్రితం ముగింపు 85,632.68). సెషన్ మొత్తం దిగువ వైపునే కదిలింది.ఇంట్రాడేలో 85,187.84 వద్ద రోజు కనిష్ఠాన్ని తాకిన సూచీ, ట్రేడింగ్ ముగిసే సమయానికి 400.76 పాయింట్లు పడిపోయి 85,231.92 వద్ద నిలిచింది. నిఫ్టీ కూడా 124 పాయింట్ల నష్టంతో 26,068.15 వద్ద మూసుకుంది. సెన్సెక్స్-30 కంపెనీల్లో మారుతీ, టాటా స్టీల్,హెచ్సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, బీఈఎల్ షేర్లు నష్టాల్లో ముగిసాయి. ఇక మారుతీ సుజుకీ, మహీంద్రా & మహీంద్రా,టీఎంపీవీ, ఐటీసీ,ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాలు నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ఆయిల్ ధర బ్యారెల్కు 62 డాలర్ల చొప్పున కదులుతుండగా, బంగారం ఔన్సు 4038 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
వివరాలు
ఆల్టైమ్ కనిష్ఠానికి రూపాయి
దేశీయ కరెన్సీ రూపాయి విలువ మరింత బలహీనపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి తొలిసారిగా 89 మార్కును దాటింది. బుధవారం 88.67గా ఉన్న రూపాయి గురువారం ఒక్కరోజులోనే 87 పైసలు క్షీణించి 89.55 స్థాయికి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రతికూల ధోరణి, దేశీయ స్టాక్ మార్కెట్లోని బలహీన సంకేతాలు రూపాయి పతనానికి దారితీశాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 30న 88.85 వద్ద రూపాయి ఆల్టైమ్ కనిష్ఠాన్ని తాకగా, అక్టోబర్ 14న 88.81 వద్ద మరోసారి కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది. మరోవైపు, డాలర్ బలపడుతున్న నేపథ్యంలో డాలర్ ఇండెక్స్ ప్రస్తుతం 100.05 వద్ద కొనసాగుతోంది.