LOADING...
Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు.. నిఫ్టీ @ 24,865
భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు.. నిఫ్టీ @ 24,865

Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు.. నిఫ్టీ @ 24,865

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 02, 2026
04:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ షేర్‌ మార్కెట్లు సోమవారం తీవ్ర పతనాన్ని చూశాయి. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా ఎగిసిపడుతున్న ముడి చమురు ధరలు పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించాయి. దీంతో సూచీలు గట్టిగా కుదేలయ్యాయి. రోజంతా జరిగిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ వెయ్యి పాయింట్లకు పైగా జారిపడగా, నిఫ్టీ కీలకమైన 25,000 స్థాయిని కోల్పోయింది.

వివరాలు 

ఆద్యంతం ఒడుదొడుకులే..

యుద్ధ భయాల నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభమైన వెంటనే మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. గత సెషన్‌ ముగింపు స్థాయి 81,287.19తో పోలిస్తే సెన్సెక్స్‌ దాదాపు 2,700 పాయింట్లు క్షీణించి 78,543.73 వద్ద ప్రారంభమైంది. అనంతరం కొంతవరకు కోలుకునే ప్రయత్నం చేసినప్పటికీ, నష్టాల నుంచి పూర్తిగా బయటపడలేకపోయింది. చివరికి మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 1,048.34 పాయింట్లు తగ్గి 80,238.85 వద్ద నిలిచింది. ఇక నిఫ్టీ రోజంతా 24,603 నుంచి 24,989 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. చివరకు 312.95 పాయింట్లు పడిపోయి 24,865.70 వద్ద ముగిసింది. ఇదే సమయంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 44 పైసలు బలహీనపడి 91.52 వద్ద స్థిరపడింది.

వివరాలు 

2 శాతం మేర పడిపోయిన ఆటో,చమురు రంగ సూచీలు 

నిఫ్టీ సూచీలో ఎల్‌అండ్‌టీ, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌, అదానీ పోర్ట్స్‌, టాటా మోటార్స్‌ ప్యాసెంజర్‌ వెహికల్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. మరోవైపు భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, సన్‌ ఫార్మా, ఓఎన్జీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌, హిందాల్కో షేర్లు లాభాల్లో ముగిశాయి. లోహ రంగాన్ని మినహాయిస్తే మిగతా అన్ని రంగాల షేర్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా ఆటో,చమురు రంగ సూచీలు సుమారు 2 శాతం మేర పడిపోయాయి.

Advertisement