LOADING...
Stock Market: పశ్చిమాసియా ఉద్రిక్తతలతో నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు
పశ్చిమాసియా ఉద్రిక్తతలతో నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు

Stock Market: పశ్చిమాసియా ఉద్రిక్తతలతో నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
May 05, 2026
04:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ షేర్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం నష్టాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం వల్ల గత సెషన్‌లో నమోదైన లాభాలకు గండిపడింది. అమెరికా 'ప్రాజెక్ట్‌ ఫ్రీడమ్‌' పేరిట రెండు నౌకలను హర్మూజ్‌ జలసంధి గుండా పంపినట్లు ప్రకటించింది. దీనికి ప్రతిస్పందనగా తమ సముద్ర జలాల్లోకి వచ్చిన అమెరికా నౌకపై దాడి చేసినట్లు ఇరాన్‌ వెల్లడించింది. మరోవైపు, తమ చర్యలను అడ్డుకోవడానికి వచ్చిన ఇరాన్‌కు చెందిన చిన్న నౌకలను ధ్వంసం చేశామని అమెరికా తెలిపింది. ఈ పరిణామాలు అంతర్జాతీయంగా ఆందోళనలను పెంచాయి. అదనంగా యూఏఈ లక్ష్యంగా ఇరాన్‌ దాడి జరగడం మార్కెట్‌ భావోద్వేగాలను మరింత దెబ్బతీసింది. ముఖ్యంగా బ్యాంకింగ్‌, స్థిరాస్తి, చమురు-వాయువు రంగాలకు చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.

వివరాలు 

డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.25గా నమోదు 

సెన్సెక్స్‌ 77,103.72 పాయింట్ల వద్ద బలహీనంగా ప్రారంభమై, రోజు మొత్తం ఒత్తిడిలోనే ట్రేడ్‌ అయింది. ఇంట్రాడేలో 76,515.03 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది. చివరికి 251.61 పాయింట్లు కోల్పోయి 77,017.79 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 86.50 పాయింట్లు పడిపోయి 24,032 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.25 వద్ద కొనసాగింది.

వివరాలు 

పెరుగుదల దిశలో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు

సెన్సెక్స్‌ 30 షేర్లలో ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎటర్నల్‌, టెక్‌ మహీంద్రా, యాక్సిస్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌ నష్టాల్లో ముగిశాయి. అయితే మహీంద్రా అండ్‌ మహీంద్రా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభాలు నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు పెరుగుదల దిశలో కొనసాగుతున్నాయి. బ్రెంట్‌ చమురు బ్యారెల్‌ ధర 112 డాలర్ల వద్ద నిలిచింది. మరోవైపు బంగారం ఔన్సు ధర 4552 డాలర్ల వద్ద వ్యాపారం సాగిస్తోంది.

Advertisement