LOADING...
Stock Market: స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. 1350 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. 1350 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

Stock Market: స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. 1350 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 09, 2026
04:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరగడం, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఎప్పటి వరకు కొనసాగుతాయోనన్న అనిశ్చితి పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించింది. ఈ ప్రభావంతో ప్రపంచ మార్కెట్లతో పాటు భారత మార్కెట్‌ సూచీలు కూడా గణనీయంగా పడిపోయాయి. ట్రేడింగ్‌ సమయంలో ఒక దశలో సెన్సెక్స్‌ దాదాపు 2,496 పాయింట్లు క్షీణించినప్పటికీ, చివరికి కొంతమేర కోలుకుని 1,352 పాయింట్ల నష్టంతో ముగిసింది. మధ్యలో నమోదైన నష్టాలను దాదాపు సగానికి తగ్గించుకోవడం పెట్టుబడిదారులకు కొంత ఊరటనిచ్చింది.

వివరాలు 

సూచీల గమనం ఇలా..

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాల ప్రభావంతో సెన్సెక్స్‌ ఉదయం ట్రేడింగ్‌ను 1,862 పాయింట్ల భారీ నష్టంతో 77,056.75 వద్ద ప్రారంభించింది. ఇంట్రాడేలో ఒక దశలో 76,424.55 వద్ద కనిష్ఠాన్ని తాకింది. అనంతరం కొంత పుంజుకుని చివరికి 1,352.74 పాయింట్లు కోల్పోయి 77,566.16 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా ట్రేడింగ్‌లో ఒక సమయంలో 23,697.80 వరకు పడిపోయింది. చివరికి 422.40 పాయింట్ల నష్టంతో 24,028.05 వద్ద స్థిరపడింది. ఇదే సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 53 పైసలు పడిపోయి 92.35 వద్ద కొనసాగుతోంది.

వివరాలు 

సూచీల గమనం ఇలా..

సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో రిలయన్స్‌, సన్‌ ఫార్మా, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టెక్‌ మహీంద్రా షేర్లు మాత్రమే లాభాల్లో నిలిచాయి. మరోవైపు అల్ట్రాటెక్‌ సిమెంట్‌, మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఎస్‌బీఐ, అదానీ పోర్ట్స్‌ వంటి షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ చమురు ధర బ్యారెల్‌కు 104.62 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ధర ఔన్సుకు 5,108 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. నిన్న అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియగా, నేడు ఆసియా మార్కెట్లూ అదే బాట పట్టాయి. దక్షిణ కొరియాకు చెందిన కోస్పి, జపాన్‌ నిక్కీ సూచీలు కూడా గణనీయమైన నష్టాలు చవిచూశాయి.

Advertisement

వివరాలు 

కారణాలు ఇవీ..

అమెరికా, ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. యుద్ధ భయాల కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. భారత్‌ తన చమురు అవసరాల్లో సుమారు 85 శాతం దిగుమతులపై ఆధారపడుతోంది. దీంతో చమురు ధరలు పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన పెట్టుబడిదారుల్లో పెరిగింది. అదే సమయంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కూడా కనిష్ఠ స్థాయికి పడిపోవడం మార్కెట్‌పై అదనపు ఒత్తిడిని తీసుకొచ్చింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకుంటూనే ఉన్నారు. శుక్రవారం ఒక్కరోజే వారు రూ.6,030.38 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.

Advertisement

వివరాలు 

రాణించిన ఐటీ స్టాక్స్

మార్కెట్‌ మొత్తం నష్టాల్లో ఉన్నప్పటికీ ఐటీ రంగానికి చెందిన కొన్ని షేర్లు లాభాలు నమోదు చేశాయి. విప్రో, ఎల్‌టీఎం, పెర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌, కోఫోర్జ్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ వంటి కంపెనీల షేర్లు పెరిగాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ భారీగా పడిపోవడం ఐటీ కంపెనీలకు అనుకూలంగా మారింది. ఈ సంస్థలకు ఆదాయం ఎక్కువగా డాలర్లలో వస్తుండగా, ఖర్చులు రూపాయల్లో ఉండటం వల్ల లాభదాయకత పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా గత నెలలో ఐటీ స్టాక్స్‌ గణనీయంగా పడిపోవడంతో తక్కువ ధరల వద్ద పెట్టుబడిదారులు కొనుగోళ్లు చేయడం కూడా ఈ రంగానికి మద్దతు ఇచ్చింది.

Advertisement