Stock market: మార్కెట్లకు ఊపిరి.. భారీ లాభాల్లో ముగిసిన సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు బలంగా కోలుకుని గణనీయమైన లాభాలతో ముగిశాయి. ఇరాన్పై దాడుల అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐదు రోజుల విరామం ప్రకటించడం పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచింది. ఈ నిర్ణయంతో అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడం కూడా మార్కెట్కు తోడ్పడింది. ఫలితంగా, గత సెషన్లో వచ్చిన భారీ నష్టాల నుంచి సూచీలు గట్టెక్కాయి. రోజు మధ్యలోనే సెన్సెక్స్ 1700 పాయింట్లకు పైగా ఎగసి పడగా, నిఫ్టీ కూడా ఇంట్రాడే ట్రేడింగ్లో 23,000 మార్కును తాకింది. పెట్టుబడిదారుల సంపదను ప్రతిబింబించే బీఎస్ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ ఒక్క రోజులోనే రూ.7 లక్షల కోట్ల మేర పెరిగి రూ.423 లక్షల కోట్లకు చేరింది.
వివరాలు
సెన్సెక్స్, నిఫ్టీ ప్రదర్శన
సెన్సెక్స్ ఉదయం 74,212.47 పాయింట్ల వద్ద (మునుపటి ముగింపు: 72,696.39) లాభాలతో ట్రేడింగ్ను ప్రారంభించింది. ట్రేడింగ్ మొత్తం వ్యవధిలోనూ పాజిటివ్ జోన్లో కొనసాగుతూ, ఇంట్రాడేలో 74,489.39 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి 1372.06 పాయింట్లు ఎగిసి 74,068.45 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా అదే దిశలో సాగుతూ 399.75 పాయింట్ల లాభంతో 22,912.40 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 93.86గా నమోదైంది.
వివరాలు
ఏ స్టాక్స్ లాభపడ్డాయి? ఏవి నష్టపోయాయి?
సెన్సెక్స్లోని 30 కంపెనీలలో ఎల్అండ్టీ, ఇండిగో, ఎటర్నల్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు మంచి లాభాలను నమోదు చేశాయి. మరోవైపు పవర్గ్రిడ్ కార్పొరేషన్, ఎస్బీఐ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితి అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ చమురు ధర బ్యారెల్కు 101 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో బంగారం ధర ఔన్సుకు 4430 డాలర్ల వద్ద కొనసాగుతోంది.