Stock Market: స్టాక్ మార్కెట్లో భారీ పతనం..సెన్సెక్స్ 900 పాయింట్లు డౌన్
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ను భారీ నష్టాలతో ప్రారంభించాయి. గత రెండు సెషన్లలో లాభాల దిశగా కదిలిన సూచీలు ఈరోజు ఒక్కసారిగా ఒత్తిడికి లోనయ్యాయి. యుద్ధం ముగింపుపై స్పష్టత లేకపోవడం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మళ్లీ 100డాలర్ల మార్క్ దాటడం మదుపర్ల సెంటిమెంట్ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఫలితంగా మార్కెట్లో భారీ అమ్మకాలు కనిపించాయి. ఉదయం 9:34 గంటల సమయంలో సెన్సెక్స్ 905పాయింట్ల నష్టంతో 74,367 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో నిఫ్టీ 269పాయింట్లు తగ్గి 23,037 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సూచీలో ఓఎన్జీసీ,హెచ్సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, విప్రో,ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో నిలిచాయి. అయితే శ్రీరామ్ ఫైనాన్స్, టీఎంపీవీ, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎటర్నల్ షేర్లు నష్టాల్లోకి జారాయి.
వివరాలు
జీవనకాల కనిష్ఠానికి చేరువలో రూపాయి
ఇక అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో రూపాయి పతనం కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.24కి పడిపోయింది. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో స్పష్టత లేకపోవడంతో ఇంధన సరఫరాపై అనిశ్చితి నెలకొంది. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడిన దేశాలపై ఈ పరిస్థితి మరింత ఒత్తిడి తీసుకొస్తోంది. దీని ప్రభావం రూపాయి విలువపై తీవ్రంగా కనిపిస్తోంది.