Swiggy: ఇన్స్టామార్ట్ సీఈఓ అమితేశ్ కుమార్ ఝా రాజీనామా.. స్విగ్గీ షేర్లలో జోష్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీకి చెందిన క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ ఇన్స్టామార్ట్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇన్స్టామార్ట్ సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న అమితేశ్ కుమార్ ఝా తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందని కంపెనీ వెల్లడించింది. అలాగే, ఆగస్టు 3 నుంచి నందిత సిన్హా కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నట్లు స్విగ్గీ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. ఈ పరిణామం నేపథ్యంలో మంగళవారం స్విగ్గీ షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపించింది. ప్రారంభ ట్రేడింగ్లో షేరు ధర 0.03 శాతం స్వల్ప పెరుగుదలతో రూ.257.90 వద్ద ప్రారంభమైంది.
వివరాలు
కంపెనీ సీనియర్ మేనేజ్మెంట్ సభ్యత్వానికి కూడా రాజీనామా..
అనంతరం ఇంట్రాడే ట్రేడింగ్లో రూ.273 గరిష్ఠ స్థాయిని చేరుకుంది.
మొత్తం ట్రేడింగ్ సమయంలో షేర్లు సుమారు 5 శాతం వరకు లాభపడ్డాయి.
మధ్యాహ్నం 2.05 గంటల సమయంలో బీఎస్ఈలో స్విగ్గీ షేరు రూ.268.27 వద్ద ట్రేడవుతోంది.
అమితేశ్ కుమార్ ఝా సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని స్విగ్గీ తన ప్రకటనలో పేర్కొంది.
జులై 28న ఆయన కంపెనీ సీనియర్ మేనేజ్మెంట్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారని, ఆ రాజీనామా వెంటనే అమల్లోకి వచ్చినట్లు తెలిపింది.
వివరాలు
కీలక నాయకత్వ బాధ్యతలు..
భవిష్యత్తులో సంస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు కాంట్రిబ్యూషన్ మార్జిన్ను దశలవారీగా మెరుగుపరచడంపై దృష్టి సారిస్తామని కంపెనీ స్పష్టం చేసింది.
ఇక కొత్త సీఈఓగా నియమితులైన నందిత సిన్హా గతంలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్తో పాటు ఎఫ్ఎంసీజీ రంగానికి చెందిన సంస్థల్లో కీలక నాయకత్వ బాధ్యతలు నిర్వహించిన అనుభవం కలిగి ఉన్నారు.