Sahara Group: సహారా అధినేత సుబ్రతా రాయ్ మరణం.. ఆ రూ.25,000 కోట్ల ఎవరికి?
సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ అనారోగ్యంతో మంగళవారం రాత్రి మరణించారు. ఆయన మరణానంతరం కీలక అంశంపై చర్చ మొదలైంది. సెబీ ఖాతాలో సహారా గ్రూప్కు చెందిన ఇంకా పంపిణీ చేయని రూ.25,000 కోట్లకు పైగా సొమ్ము ఉంది. ఇప్పుడు ఈ డబ్బు పరిస్థితి ఏంటి అనేదిదానిపై చర్చ నడుస్తోంది. సుబ్రతా రాయ్ తన గ్రూప్ కంపెనీలకు సంబంధించి అనేక ఆరోపణలను ఎదుర్కొన్నాడు. వీటిలో పోంజీ స్కీమ్లలో నిబంధనలను దాటవేశారని అభియోగాలు కూడా ఉన్నాయి. 2011లో సహారా కంపెనీలైన సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్ (SIREL), సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (SHICL)కు సెబీ కీలక ఆదేశాలు జారీ చేసింది.
నిధుల సేకరణలో నిబంధనల ఉల్లంఘించిన సహారా గ్రూప్
ఈ రెండు కంపెనీలు బాండ్ల ద్వారా దాదాపు రూ. 3కోట్ల విలువైన నిధులను సమీకరించాయి. నిబంధనలను ఉల్లంఘించి రెండు కంపెనీలు నిధులు సేకరించాయని సెబీ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనిపై సుబ్రతా రాయ్ న్యాయపోరాటానికి దిగారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్లగా, సెబీ ఆదేశాలను సమర్థిస్తూ 2012 ఆగస్టు 31న ధర్మాసనం తీర్పు చెప్పింది. పెట్టుబడిదారులకు డబ్బును తిరిగి ఇవ్వడానికి సెబీ వద్ద రూ. 24,000 కోట్లు డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. అయితే నాడు ప్రత్యేక అకౌంట్ తీసి అందులో రూ.24వేల కోట్లు జమ చేయగా.. అవి ఇప్పుడు రూ.25వేల కోట్లకు చేరాయి. అయితే ఇప్పుడు సుబ్రతా చనిపోవడంతో సెబీ ఆ సొమ్ము విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.