LOADING...
Year Ender 2025 : ఉద్యోగస్తులకు కలిసి వచ్చిన 2025.. భారీ ఊరటనిచ్చిన అంశాలు ఇవే! 
ఉద్యోగస్తులకు కలిసి వచ్చిన 2025.. భారీ ఊరటనిచ్చిన అంశాలు ఇవే!

Year Ender 2025 : ఉద్యోగస్తులకు కలిసి వచ్చిన 2025.. భారీ ఊరటనిచ్చిన అంశాలు ఇవే! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 16, 2025
10:54 am

ఈ వార్తాకథనం ఏంటి

డిసెంబర్ చివరి నెల కొనసాగుతుండగా, 2025సంవత్సరం కూడా ముగింపు దశకు చేరుకుంది. ఈ ఏడాది ప్రభుత్వం ఉద్యోగస్తుల కోసం తీసుకొచ్చిన పలు కీలక నిర్ణయాలు వారికి గణనీయమైన ఉపశమనం కలిగించాయి. నేటి ఖరీదైన జీవనశైలిలో పన్ను ఆదా ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. 2025లో అమలులోకి వచ్చిన మార్పులు మధ్యతరగతి ప్రజల జేబులపై నేరుగా ప్రభావం చూపుతూ ఆర్థిక ఒత్తిడిని తగ్గించాయి. ఆదాయపు పన్ను శ్లాబుల నుంచి జీఎస్టీ నిర్మాణం, టోల్ చార్జీల వరకు తీసుకొచ్చిన మార్పులు ఆర్థిక ప్రణాళికను మరింత సులభతరం చేశాయి. దీనికి తోడు, సంవత్సరం చివర్లో ప్రభుత్వం గ్రాట్యూటీ నిబంధనల్లో కూడా కీలక సవరణ చేసింది. 2025లో ఉద్యోగస్తులకు లభించిన ఈ ప్రధాన ఉపశమనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Details

ఆదాయపు పన్నులో చారిత్రక మార్పు

ఈ ఏడాది ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఆదాయపు పన్ను విధానంలోనే చోటుచేసుకుంది. కొత్త పన్ను వ్యవస్థలో ప్రాథమిక పన్ను-రహిత పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.12లక్షలకు పెంచారు. దీనికి అదనంగా ఉద్యోగస్తులకు వర్తించే రూ.75,000ప్రామాణిక తగ్గింపును కలిపితే, మొత్తం పన్ను రహిత ఆదాయం నేరుగా రూ.12.75 లక్షలకు చేరింది. దీంతో జీతం పెరిగినప్పటికీ పన్ను భారం గణనీయంగా తగ్గి, మిగిలిన మొత్తం నేరుగా చేతిలో ఉండే పరిస్థితి ఏర్పడింది. ఈ మార్పు వల్ల EMIలు, పెట్టుబడులు, బీమా, పొదుపు పథకాలను సులభంగా ప్రణాళిక చేసుకునే అవకాశం ఉద్యోగస్తులకు లభించింది. ముఖ్యంగా రూ.10నుంచి రూ.13 లక్షల ప్యాకేజీ ఉన్నవారికి ఇది పెద్ద ఊరటగా మారింది. ఇంతకు ముందు భారీగా పన్నులు చెల్లించాల్సి వచ్చేది.

Details

GST ఖర్చుల్లో తగ్గింపు

పన్ను సంస్కరణల్లో మరో కీలక అడుగు GST 2.0. దీని వల్ల రోజువారీ కొనుగోళ్లు మరింత చౌకగా మారాయి. GST శ్లాబ్‌లను గతంలో ఉన్న నాలుగు కేటగిరీల నుంచి రెండింటికి కుదించారు. ఇప్పుడు ఎక్కువ వస్తువులపై 5 శాతం లేదా 18 శాతం పన్నే వర్తిస్తోంది. లగ్జరీ వస్తువులను మినహాయిస్తే, సాధారణ వినియోగదారుల బుట్టలో ఉండే దాదాపు 413 వస్తువులపై పన్ను తగ్గింది. కార్లు కొనుగోలు చేసేవారికీ ఇది లాభదాయకంగా మారింది. 1200 సీసీ వరకు ఉన్న పెట్రోల్ కార్లు, 1500 సీసీ వరకు డీజిల్ కార్లు, 350 సీసీ వరకు బైక్‌లు ఇప్పుడు 28 శాతం కాకుండా కేవలం 18 శాతం GSTతో లభిస్తున్నాయి.

Advertisement

Details

టోల్ ఖర్చుల్లో భారీ ఉపశమనం

టోల్ ట్యాక్స్‌లో చేసిన మార్పులు రోడ్డు ప్రయాణాన్ని మరింత చౌకగా మార్చాయి. కొత్తగా ప్రవేశపెట్టిన వార్షిక ఫాస్టాగ్ పాస్‌ను కేవలం రూ.3,000కే పొందవచ్చు. ఈ పాస్‌తో సుమారు 200 టోల్ ప్లాజాలను దాటే అవకాశం ఉంటుంది. అంటే ఒక్కో టోల్‌కు అయ్యే సగటు ఖర్చు దాదాపు రూ.15 మాత్రమే. రోజూ ప్రయాణించే వారికి ఇది మునుపటితో పోలిస్తే చాలా పెద్ద లాభంగా మారింది.

Advertisement

Details

గ్రాట్యూటీ కోసం నిరీక్షణ ముగిసింది 

లేబర్ కోడ్ కింద గ్రాట్యూటీ నిబంధనల్లో చేసిన మార్పు ఉద్యోగస్తులకు మరో శుభవార్త. ఇంతకు ముందు గ్రాట్యూటీ పొందాలంటే కనీసం ఐదేళ్లు పనిచేయాల్సి ఉండేది. కానీ తాజా సవరణలతో కేవలం ఒక సంవత్సరం పనిచేసిన తర్వాతే ఉద్యోగి గ్రాట్యూటీకి అర్హత పొందుతాడు. ఈ మార్పు ఉద్యోగాలు మారే వారికి, ప్రారంభ దశలో ఉన్న ఉద్యోగస్తులకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ఇది వారి ఆర్థిక భద్రతను మరింత బలపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే, 2025లో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు ఉద్యోగస్తుల ఆర్థిక జీవితాన్ని మరింత సులభం చేసి, జేబుపై భారం తగ్గించాయని చెప్పవచ్చు.

Advertisement