Oil prices: ఇరాన్తో యుద్ధం ముగిస్తే చమురు ధరలు రాయిలా పడిపోతాయి: ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్తో కొనసాగుతున్న సైనిక ఘర్షణకు ముగింపు పలికిన వెంటనే అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా తగ్గుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఇతర ఉత్పత్తుల ధరలు తగ్గుతున్నప్పటికీ.. చమురు ధరలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇరాన్ వివాదం కారణంగానే క్రూడ్ ధరలపై ఒత్తిడి కొనసాగుతోందని తెలిపారు. ''ఇరాన్తో సైనిక ఘర్షణ ముగిసిన వెంటనే చమురు ధర రాయిలా కిందకు పడిపోతుంది'' అని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్'లో పేర్కొన్నారు. మరోవైపు.. మంగళవారం అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు మరోసారి పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 1.18 శాతం పెరిగి బ్యారెల్కు 106.93 డాలర్లకు చేరాయి.
వివరాలు
అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న క్రూడ్ ధరలు
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, చమురు సరఫరా, రవాణాకు సంబంధించిన అనిశ్చితి కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ధరలు ఎగబాకుతున్నాయి.
అమెరికాలో ఇతర వస్తువుల ధరలు గణనీయంగా తగ్గుతున్నాయని, అయితే చమురు ధరలు మాత్రం ఆ ధోరణికి మినహాయింపుగా ఉన్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అమెరికాలో ధరల పెరుగుదలకు మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వ విధానాలే కారణమని ట్రంప్ మరోసారి ఆరోపించారు.
బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చమురు ధరలు ప్రస్తుత స్థాయికంటే ఎక్కువగా ఉండేవని కూడా ఆయన పేర్కొన్నారు.
వివరాలు
ఈ ఏడాదిలోనే యుద్ధం ముగిసే అవకాశం: ట్రంప్
ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం ఈ ఏడాదిలోనే ముగిసే అవకాశం ఉందని ట్రంప్ ఇప్పటికే పలుమార్లు వెల్లడించారు.
అయితే, యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇరాన్తో ఎలాంటి ఒప్పందం కుదురుతుంది? హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు ఎప్పుడు, ఎలా సాధారణ స్థితికి వస్తాయి? వంటి కీలక అంశాలపై ఇంకా స్పష్టత లేదు.