Vaibhav Sooryavanshi - Sanju Samson: సంజు ఫెయిల్.. వైభవ్కు ఛాన్స్ ఇస్తారా?
ఈ వార్తాకథనం ఏంటి
అఫ్గానిస్థాన్తో తొలి టీ20లో విఫలమైన సంజు శాంసన్కు మళ్లీ జట్టులో చోటుపై ఒత్తిడి పెరుగుతోంది. ఒక్క మ్యాచ్లో విఫలమైనంత మాత్రాన పక్కన పెడతారా? అనే సందేహం అభిమానుల్లో రావచ్చు. కానీ టీమిండియాలో ఆ స్థానానికి తీవ్ర పోటీ ఉండటంతో సంజు తన అవకాశాన్ని నిలబెట్టుకోవాలంటే రాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని అఫ్గానిస్థాన్తో జరిగిన తొలి టీ20లో బెంచ్కే పరిమితం చేసిన భారత మేనేజ్మెంట్.. సంజు శాంసన్ను తుది జట్టులోకి తీసుకుంది. అయితే సంజు మాత్రం 10 పరుగులకే పెవిలియన్కు చేరి నిరాశపరిచాడు. అఫ్గాన్పై తొలి మ్యాచ్లో టీమ్ఇండియా అలవోకగా విజయం సాధించినప్పటికీ.. సంజుపై మాత్రం ఒత్తిడి పెరిగింది.
వివరాలు
అభిషేక్ హిట్..
రెండో టీ20లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ కుర్రాడికి అవకాశాలు ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు.
అఫ్గానిస్థాన్తో తొలి టీ20లో ఓపెనర్గా అభిషేక్ శర్మ ఎలాంటి ఆటతీరు ప్రదర్శించాడో చూశాం. దూకుడుగా బ్యాటింగ్ చేసిన అతడు హాఫ్ సెంచరీ సాధించడంతోపాటు.. టీమ్ఇండియా అలవోకగా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
వన్డౌన్లో వచ్చిన ఇషాన్ కిషన్ కూడా రాణించాడు. దీంతో మంగళవారం జరగనున్న రెండో టీ20 నుంచి అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్లను తప్పించడం కష్టమే.
అలాంటి పరిస్థితుల్లో మిగిలిన అవకాశం సంజు శాంసన్కే ఉంది. అయితే, టీమ్ఇండియా హెడ్ కోచ్ గంభీర్కు సంజుపై గురి కాస్త ఎక్కువే అనే అభిప్రాయం క్రికెట్ వర్గాల్లో ఉంది.
వివరాలు
సత్తా చూపితేనే..
అందువల్ల వెంటనే ఈ కేరళ ప్లేయర్పై వేటు పడే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
అయితే ఒకవేళ రెండో టీ20లోనూ సంజు విఫలమైతే.. మూడో టీ20లో వైభవ్ సూర్యవంశీకి కచ్చితంగా అవకాశం దక్కే పరిస్థితి ఉంటుందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.
గత టీ20 ప్రపంచ కప్లో అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించడంతో సంజు శాంసన్ పేరు మారుమోగిపోయింది.
అయినప్పటికీ, టీమ్ఇండియా తుది జట్టులో అతడి స్థానానికి ఇప్పటికీ గ్యారంటీ లభించలేదు.
ఇందుకు ప్రధాన కారణం యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఇంగ్లాండ్తో జరిగిన గత సిరీస్లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన వైభవ్కు తొలినాళ్లలో పరిస్థితులు అనుకూలించలేదు.
వివరాలు
ఇద్దరి మధ్య తీవ్ర పోటీ
అయితే, జింబాబ్వేపై దూకుడుగా బ్యాటింగ్ చేసి మళ్లీ ఫామ్లోకి వచ్చాడు. దీంతో ప్రస్తుతం రెండో ఓపెనర్ స్థానం కోసం సంజు శాంసన్, వైభవ్ సూర్యవంశీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
అఫ్గానిస్థాన్తో జరుగుతున్న ఈ సిరీస్లో సత్తా చాటిన ఆటగాడికే ఆసియా కప్తోపాటు జపాన్తో జరగనున్న ఏకైక టీ20లో తుది జట్టులో ఆడే అవకాశం దక్కనుంది.
ఇప్పటికే తొలి మ్యాచ్లో సంజు శాంసన్ నిరాశపరిచాడు. ఇక రెండో టీ20లో సంజు ఆడినా, వైభవ్కు అవకాశం ఇచ్చినా.. ఎవరైతే ఆడతారో వారు మంచి ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది.
వివరాలు
బౌలింగ్లో మనోళ్లు ఓకే.. కానీ..
అఫ్గానిస్థాన్తో జరిగిన తొలి టీ20లో టీమ్ఇండియా బౌలింగ్ ప్రదర్శనను పూర్తిగా విశ్లేషించాలంటే కాస్త కష్టంగానే ఉంది.
మ్యాచ్ ఆరంభంలో భారత బౌలర్లు టకటకా వికెట్లు పడగొట్టారు. అయితే, మిడిల్ ఓవర్లలో కాస్త పట్టు వదిలారు.
చివర్లో మాత్రం మళ్లీ ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేశారు. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్తోపాటు భారత స్పిన్నర్లు కూడా సత్తా చాటారు.
అయితే, చాన్నాళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన తెలుగు ఆల్రౌండర్ నితీశ్ కుమార్ మాత్రం కాస్త ఇబ్బంది పడ్డాడు.
రెండో టీ20లో నితీశ్ కూడా పుంజుకుని తన సత్తా చాటాల్సిన అవసరం ఉంది.