LOADING...
Vijay Kedia: ఈక్విటీ పెట్టుబడులపై దీర్ఘకాలిక లాభాల పన్ను రద్దు చేయాలి: కేంద్రానికి విజయ్‌ కేడియా విజ్ఞప్తి
కేంద్రానికి విజయ్‌ కేడియా విజ్ఞప్తి

Vijay Kedia: ఈక్విటీ పెట్టుబడులపై దీర్ఘకాలిక లాభాల పన్ను రద్దు చేయాలి: కేంద్రానికి విజయ్‌ కేడియా విజ్ఞప్తి

వ్రాసిన వారు Sirish Praharaju
May 28, 2026
01:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

లిస్టెడ్‌ ఈక్విటీల్లో పెట్టుబడులపై విధిస్తున్న దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను మరోసారి చర్చకు దారితీసింది. ప్రముఖ మదుపరి విజయ్‌ కేడియా ఈ పన్నును పూర్తిగా రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు. భారత్‌లో ప్రపంచస్థాయి సంస్థలు ఎదగాలంటే దీర్ఘకాలిక పెట్టుబడులు ఎంతో అవసరమని విజయ్‌ కేడియా అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ప్రోత్సాహం కల్పించాలంటే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న పన్ను విధానం స్వల్పకాలిక వ్యాపార లావాదేవీలు, దీర్ఘకాలిక పెట్టుబడుల మధ్య సరైన తేడాను గుర్తించడం లేదని పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విజయ్‌ కేడియా చేసిన ట్వీట్ 

వివరాలు 

ఉత్పాదక రంగాల వైపు మళ్లేలా పన్ను విధానాలు

దీర్ఘకాలిక పెట్టుబడిదారులు కేవలం మార్కెట్‌లో కొనుగోలు విక్రయాలు చేసే వ్యక్తులు కాదని, దేశ సంపద సృష్టిలో భాగస్వాములని ఆయన తెలిపారు. ఒక సంస్థ అభివృద్ధి చెందుతున్న సమయంలో ప్రభుత్వం ఇప్పటికే కార్పొరేట్‌ పన్ను, వస్తు సేవల పన్ను, ఉద్యోగుల ఆదాయపు పన్ను, కస్టమ్స్‌ సుంకాలు, స్టాంపు సుంకాల రూపంలో పెద్ద మొత్తంలో ఆదాయం పొందుతోందన్నారు. అలాంటి సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారిపై మళ్లీ దీర్ఘకాలిక లాభాల పన్ను విధించడం సరైన విధానం కాదని చెప్పారు. ప్రజల పొదుపు మొత్తాలు బంగారం వంటి నిల్వల వైపు కాకుండా ఉపాధి అవకాశాలు పెంచే, దేశ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చే ఉత్పాదక రంగాల వైపు మళ్లేలా పన్ను విధానాలు ఉండాలని విజయ్‌ కేడియా సూచించారు.

Advertisement

వివరాలు 

రూ.1.25 లక్షల వరకు మాత్రం మినహాయింపు

అలా చేస్తేనే భారత్‌లో ప్రపంచస్థాయి సంస్థలు ఏర్పడే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. భారత్‌లో 2004 వరకు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను అమల్లో ఉండేది. తరువాత దాన్ని రద్దు చేశారు. అయితే 2018లో మళ్లీ ఈ పన్నును అమల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం 2024 నుంచి ఈక్విటీ పెట్టుబడులపై వచ్చే దీర్ఘకాలిక లాభాలపై 12.5 శాతం పన్ను విధిస్తున్నారు. రూ.1.25 లక్షల వరకు మాత్రం మినహాయింపు కొనసాగుతోంది.

Advertisement