Loading...
Volkswagen-JSW: వోక్స్‌వ్యాగన్ ఇండియా వ్యాపారంలో మెజారిటీ వాటా కోసం జేఎస్‌డబ్ల్యూతో చర్చలు
వోక్స్‌వ్యాగన్ ఇండియా వ్యాపారంలో మెజారిటీ వాటా కోసం జేఎస్‌డబ్ల్యూతో చర్చలు

Volkswagen-JSW: వోక్స్‌వ్యాగన్ ఇండియా వ్యాపారంలో మెజారిటీ వాటా కోసం జేఎస్‌డబ్ల్యూతో చర్చలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 21, 2026
04:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ భారత వ్యాపారంలో కీలక మార్పులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భారత ఆటో మొబైల్ మార్కెట్లో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు స్థానిక భాగస్వామిని వెతుకుతున్న కంపెనీ,జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో కీలక చర్చలు జరుపుతున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. ఈచర్చల్లో భాగంగా స్కోడా ఆటో వోక్స్‌వ్యాగన్ ఇండియాలో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ పెట్టుబడి పెట్టే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఈ సంయుక్త సంస్థలో మెజారిటీ వాటా తీసుకోవాలని భావిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. అయితే సంస్థ విలువ,ఇరు కంపెనీలు పెట్టబోయే పెట్టుబడి మొత్తం వంటి అంశాలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. దీంతోచర్చలు విఫలమయ్యే అవకాశం కూడా ఉందని సమాచారం.

వివరాలు 

అధికారిక ప్రకటన చేయని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్,వోక్స్‌వ్యాగన్

ఈ వ్యవహారంపై స్పందించిన వోక్స్‌వ్యాగన్,భారత మార్కెట్‌కు సంబంధించిన తమ వ్యూహంలో భాగంగా కొత్త వ్యాపార అవకాశాలు,భాగస్వామ్యాలపై నిరంతరం పరిశీలన కొనసాగుతోందని తెలిపింది.

స్కోడా ఆటో ప్రపంచ వృద్ధి ప్రణాళికల్లో భారత్‌కు కీలక స్థానం ఉందని పేర్కొన్న కంపెనీ, జేఎస్‌డబ్ల్యూతో జరుగుతున్న చర్చలపై మాత్రం స్పందించలేదు.

జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ కూడా అధికారిక ప్రకటన చేయలేదు.వోక్స్‌వ్యాగన్ రెండు దశాబ్దాలకుపైగా భారత మార్కెట్లో ఉన్నప్పటికీ,మారుతి సుజుకి, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ వంటి సంస్థలకు గట్టి పోటీ ఇవ్వడంలో ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది.

భారత వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని స్కోడా కైలాక్ వంటి మోడళ్లను ప్రవేశపెట్టినా, మార్కెట్ వాటా ఇంకా సుమారు 2.5శాతానికే పరిమితమైంది.

వివరాలు 

ఇరు సంస్థల మధ్య మూడు సంవత్సరాల క్రితమే ప్రారంభమైన చర్చలు 

2030 నాటికి మార్కెట్ వాటాను 5 శాతానికి పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

జేఎస్‌డబ్ల్యూతో ఒప్పందం కుదిరితే వోక్స్‌వ్యాగన్‌కు తాజా పెట్టుబడితో పాటు స్థానిక భాగస్వామి లభిస్తాడు.

దీంతో భారత్‌లో వ్యాపార విస్తరణకు అవసరమైన ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంది.

మరోవైపు జేఎస్‌డబ్ల్యూకు వోక్స్‌వ్యాగన్‌కు చెందిన ఆధునిక వాహన ప్లాట్‌ఫారాలు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావచ్చు.

ఇరు సంస్థల మధ్య చర్చలు దాదాపు మూడు సంవత్సరాల క్రితమే ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

తొలుత మహారాష్ట్రలోని పుణే, ఛత్రపతి సంభాజీనగర్‌లో ఉన్న వోక్స్‌వ్యాగన్ తయారీ కేంద్రాలను జేఎస్‌డబ్ల్యూ వినియోగించుకునే అంశంపై చర్చలు జరిగాయి.

ప్రస్తుతం వాటా కొనుగోలు దిశగా చర్చలు కొనసాగుతున్నప్పటికీ, ఇంకా కొన్ని కీలక అడ్డంకులు ఉన్నాయని నివేదిక పేర్కొంది.

ADVERTISEMENT

వివరాలు 

జేఎస్‌డబ్ల్యూ గ్రూప్, ఎస్‌ఏఐసీ మోటార్‌ తో కలిసి ఎంజీ బ్రాండ్ కార్లు మార్కెట్లో విక్రయం 

భారత్‌లో పెట్టుబడి భారం తగ్గించుకునే లక్ష్యంతో వోక్స్‌వ్యాగన్ తన విద్యుత్ వాహన (ఈవీ) ప్రణాళికలను కూడా పునఃసమీక్షించింది.

కొత్త ఈవీ ప్లాట్‌ఫారంపై పెట్టుబడిని ఒక బిలియన్ డాలర్ల నుంచి సుమారు 700 మిలియన్ డాలర్లకు తగ్గించింది.

ప్రపంచవ్యాప్తంగా ఖర్చులను తగ్గించే చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఇప్పటికే చైనా సంస్థ ఎస్‌ఏఐసీ మోటార్‌తో కలిసి ఎంజీ బ్రాండ్ కార్లను భారత మార్కెట్లో విక్రయిస్తోంది.

అంతేకాకుండా సొంత బ్రాండ్‌తో కూడా వాహనాలను తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఈ నేపథ్యంలో వోక్స్‌వ్యాగన్‌తో భాగస్వామ్యం కుదిరితే ప్రయాణికుల కార్ల విభాగంలో జేఎస్‌డబ్ల్యూ మరింత బలపడే అవకాశం ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

వోక్స్‌వ్యాగన్ భాగస్వామ్యంపై  మహీంద్రా అండ్ మహీంద్రా చర్చలు

గతంలో మహీంద్రా అండ్ మహీంద్రాతో కూడా వోక్స్‌వ్యాగన్ భాగస్వామ్యంపై చర్చలు జరిపినా, అభివృద్ధి ఖర్చులు, సంస్థల విధానాల్లో ఉన్న భేదాభిప్రాయాల కారణంగా ఆ చర్చలు ఫలించలేదు.

ఈ ఒప్పందం తుది రూపం దాల్చితే భారత ప్రయాణికుల కార్ల మార్కెట్లో పోటీ తీరును గణనీయంగా మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

వోక్స్‌వ్యాగన్‌కు స్థానిక భాగస్వామి ద్వారా కొత్త అవకాశాలు లభిస్తే, జేఎస్‌డబ్ల్యూకు ప్రపంచస్థాయి సాంకేతికత, వాహన అభివృద్ధి సామర్థ్యం అందుబాటులోకి రానుంది.

ADVERTISEMENT