
Alia Bhatt: నిర్మాణ సంస్థను మోసం చేసిన కేసులో.. అలియా భట్ మాజీ పిఎ అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ నటి అలియా భట్ మాజీ వ్యక్తిగత సహాయకురాలు వేదిక ప్రకాశ్ శెట్టిను పోలీసులు అరెస్ట్ చేశారు. అలియా పేరును ఉపయోగించి దాదాపు రూ.77 లక్షల మేర మోసం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ మోసం ఆమె అలియా భట్కు చెందిన నిర్మాణ సంస్థ 'ఎటర్నల్ సన్షైన్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్'లో పనిచేస్తున్న సమయంలోనే చోటు చేసుకుంది. 2021 నుండి 2024 వరకు వేదిక అలియా వ్యక్తిగత సహాయకురాలిగా సేవలందించింది. ఈ సమయంలో అలియాకు సంబంధించిన ఆర్థిక పత్రాలు,చెల్లింపులు,షెడ్యూల్ ఏర్పాట్లు అన్నింటినీ ఆమె చూసుకునేది. ఆమె ఉద్యోగంలో చేరిన ఒక సంవత్సరం తరువాత నుంచే నకిలీ బిల్లులను తయారు చేసి,అలియా భట్ సంతకాన్ని మార్ఫింగ్ చేయడం ద్వారా మోసాలకు పాల్పడిందని పోలీసులు తెలిపారు.
వివరాలు
చీటింగ్ కేసు కింద వేదిక అరెస్ట్
ఈ అక్రమ కార్యకలాపాలపై నటి అలియా తల్లి, నటి, దర్శకురాలు అయిన సోనీ రజ్దాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసి చీటింగ్ కేసు కింద వేదికను అరెస్ట్ చేశారు. వేదిక, నకిలీ బిల్లులు తయారుచేసి అలియా సంతకం చేసినట్టు చూపించి, ఆ మొత్తాలను తన స్నేహితుల ఖాతాల్లోకి మళ్లించిందని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఆ డబ్బును తానే వినియోగించుకున్నట్టు విచారణలో వెల్లడైంది. కేసు నమోదైన తర్వాత వేదిక పరారైంది. రాజస్థాన్, కర్ణాటక, పూణే ప్రాంతాల్లో తలదాచుకున్న ఆమెను చివరకు బెంగళూరులో పోలీసులు పట్టుకొని, ముంబయికి తరలించారు.