Rakul Preet Brother: టాలీవుడ్లో మరో డ్రగ్స్ షాక్.. రకుల్ ప్రీత్ సోదరుడి పాత్రపై విచారణ
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నగరం మరోసారి డ్రగ్స్ కలకలంతో ఉలిక్కిపడుతోంది. ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులే వరుసగా డ్రగ్స్ కేసుల్లో చిక్కుకోవడం సంచలనంగా మారింది. మాసబ్ట్యాంక్ పరిధిలో తాజాగా వెలుగుచూసిన డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడి పేరు బయటకు రావడం టాలీవుడ్తో పాటు బాలీవుడ్లోనూ చర్చనీయాంశంగా మారింది. డ్రగ్స్రహిత తెలంగాణ లక్ష్యంగా పోలీసులు ఎంత కఠిన చర్యలు తీసుకుంటున్నా, విదేశీ డ్రగ్స్ మూలాలు మాత్రం ఏదో ఒక రూపంలో బయటపడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాసబ్ట్యాంక్ పోలీసులు, తెలంగాణ 'ఈగల్ టీం' సంయుక్తంగా నిర్వహించిన తాజా దాడుల్లో భారీగా కొకైన్, ఎండిఎంఏ (MDMA) డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.
Details
నలుగురు రెగ్యులర్ కస్టమర్లు
ఈ కేసులో ట్రూప్ బజార్కు చెందిన వ్యాపారవేత్తలు నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వీ అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరికి నలుగురు రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారని, అందులో ఒకరు టాలీవుడ్, బాలీవుడ్లో గుర్తింపు పొందిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ అని పోలీసులు నిర్ధారించారు. అతను ఈ వ్యాపారుల వద్ద నుంచి క్రమం తప్పకుండా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు తేలింది. నిందితుల నుంచి పోలీసులు మొత్తం 43 గ్రాముల కొకైన్, ఎండిఎంఏ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.
Details
హీరోయిన్ సోదరుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం
కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పరారీలో ఉన్న హీరోయిన్ సోదరుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రత్యేకంగా రంగంలోకి దిగిన ఈగల్ టీం, మాసబ్ట్యాంక్ పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. టాలీవుడ్లో గతంలోనూ పలువురు సెలబ్రిటీలు డ్రగ్స్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొనగా, ఇప్పుడు మరోసారి ఒక స్టార్ హీరోయిన్ సోదరుడి పేరు తెరపైకి రావడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. గత సంవత్సరం కూడా సైబరాబాద్ పోలీసులకు అమన్ ప్రీత్ సింగ్ పట్టుబడి, ప్రస్తుతం బెయిల్పై ఉన్నట్టు సమాచారం.