పంచ్ ప్రసాద్ కిడ్నీ మార్పు ఖర్చును భరించడానికి ముందుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం: ట్వీట్ చేసిన ఏపీ సీఎంవో
బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న పంచ్ ప్రసాద్, గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. డయాలసిస్ చేయించుకుంటూ జబర్దస్త్ స్కిట్లలో కనిపిస్తూ వస్తున్నాడు. తాజాగా పంచ్ ప్రసాద్ ఆరోగ్యం విషమించిందనీ, కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్లు తెలియజేసారు. ఈ నేపథ్యంలో జబర్దస్త్ కమెడియన్స్, తమ సోషల్ మీడియా అకౌంట్లలో పంచ్ ప్రసాద్ పరిస్థితి గురించి పోస్ట్ చేస్తూ, సాయం చేయాలని బ్యాంకు వివరాలు అందించారు. ఏపీ సీఎంవో దాకా ఈ పోస్టు వెళ్ళింది. ఈ పోస్టుకు సమాధానమిచ్చిన ఏపీ సీఎంవో, ఆల్రెడీ పంచ్ ప్రసాద్ కుటుంబ సభ్యులతో టచ్ లో ఉన్నట్లు తెలియజేసారు.
లెటర్ ఆఫ్ క్రెడిట్ అప్లై
పంచ్ ప్రసాద్ కుటుంబ సభ్యుల చేత లెటర్ ఆఫ్ క్రెడిట్ అప్లై చేయించుకుంటున్నామని, అది పూర్తి కాగానే ట్రాన్స్ ప్లాంటేషన్ కు అవసరమైన సాయం అందజేస్తామని సీఎంవో అధికారి పోస్ట్ చేసారు. డాక్యుమెంటేషన్ తొందరగా పూర్తి అయ్యి , పంచ్ ప్రసాద్ కు తొందరగా సాయం అందాలని నెటిజన్స్ కోరుకుంటున్నారు. పంచ్ ప్రసాద్ కు సాయం చేయడానికి ముందుకు వచ్చిన ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.