Sabarimala gold theft case: అయ్యప్పస్వామి క్షమించడు.. ఆలయ అవకతవకలు బయటపడాలి : జయరాం
ఈ వార్తాకథనం ఏంటి
శబరిమల బంగారం చోరీ కేసులో నిజాలు వెలుగులోకి రావడానికి తాను పూర్తిగా సహకరిస్తానని ప్రముఖ నటుడు జయరాం స్పష్టం చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా మంగళవారం ఆయన ఈడీ ఎదుట హాజరయ్యారు. విచారణకు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మలయాళీలకు శబరిమల ఆలయం ఒక భావోద్వేగం. ఆలయంలో ఏవైనా అవకతవకలు జరిగి ఉంటే వాటిని వెలుగులోకి తేవడం ప్రతి మలయాళీ బాధ్యత. నేను కూడా వారిలో ఒకడిని. కేరళలోపల, వెలుపల ఆలయాల్లో జరిగే 'అన నడయిరుతల్' (ఏనుగులపై స్వామి ఊరేగింపు) సహా అనేక కార్యక్రమాలకు గత 40 ఏళ్లుగా హాజరవుతున్నాను. ఆ అనుబంధం కారణంగానే శబరిమల ఆలయంలో బంగారు తాపడాల పూజకు నన్ను ఆహ్వానించారని తెలిపారు.
Details
సమాచారాన్ని అధికారులకు తెలియజేయాలి
తనకు తెలిసిన ఏ సమాచారం ఉన్నా అధికారులకు తప్పకుండా అందజేస్తానని జయరామ్ చెప్పారు. "ఇది మంచి పనికోసమే. అందుకే విచారణకు వచ్చాను. ఈ కేసులో మరికొందరిని అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. అధికారులు తమ పని చేసుకునేలా వదిలేయాలి. దోషులను అయ్యప్ప స్వామి క్షమించడు. నేను 50 ఏళ్లుగా భక్తుడిని. వాస్తవాలు బయటపడటం నా బాధ్యత అని పేర్కొన్నారు.
Details
ఇదీ కేసు వివరాలు
శబరిమల ఆలయంలో బంగారు తాపడాల అదృశ్యం పెద్ద సంచలనం రేపింది. ఈ కేసులో ఉన్నికృష్ణన్ పొట్టి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. 2019లో చెన్నైలో ఉన్నికృష్ణన్ నిర్వహించిన పూజల్లో, ఆలయం నుంచి బంగారం పూత కోసం తీసుకెళ్లిన తాపడాలతో జయరామ్ పాల్గొన్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో వీరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కేరళలోని శబరిమల ఆలయంలో ద్వారపాలకుల విగ్రహాలు, గర్భగుడి తలుపుల నుంచి బంగారం అదృశ్యం కావడంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కొనసాగిస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 12 మందిని సిట్ అరెస్టు చేసింది.