Mann Pishach: ప్రయోగం అదుర్స్.. రూ.33 వేలతో సినిమా..!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం సినిమా నిర్మాణ వ్యయాలు రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితుల్లో కేవలం రూ.33 వేల బడ్జెట్తో సినిమా తీస్తామని చెబితే చాలా మంది నమ్మరు. కానీ దర్శకుడు రాహి అనిల్ బార్వీ మాత్రం అది సాధ్యమేనని నిరూపించారు. 'తుంబాడ్' వంటి మిస్టరీ థ్రిల్లర్తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయనే ఇప్పుడు 'మన్-పిశాచ్' పేరుతో కొత్త ప్రయోగాత్మక చిత్రాన్ని రూపొందించారు. ఇందులో కేవలం ఇద్దరు నటులతోనే సినిమాను తెరకెక్కించడం విశేషం. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ఎలా రూపొందించారో అనిల్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వివరించారు.
వివరాలు
కేవలం 60 పేజీల స్క్రిప్ట్
ఈ సినిమా కోసం ఎలాంటి భారీ సెట్స్ వేయలేదు. ప్రస్తుతం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని వినియోగించి చిత్రాన్ని రూపొందించారు. దర్శకుడు అనిల్ మాట్లాడుతూ.. "మన్ పిశాచ్ సినిమా స్క్రిప్ట్ కేవలం 60 పేజీలే. చిత్రీకరణలో ఎక్కువగా చేతితో వేసిన స్టోరీబోర్డులు, ఐఫోన్తో తీసిన వీడియోలు, ఫొటోషాప్, జనరేటివ్ ఏఐ, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వంటి టూల్స్ ఉపయోగించి సినిమా పూర్తి చేశాం" అని చెప్పారు. ఈ చిత్రంలో యానియా భరద్వాజ్, దీపక్ దమ్లే మాత్రమే నటించారు.
వివరాలు
యూట్యూబ్లోనే విడుదల
ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్ బార్వీ కేవలం నాలుగు నెలల్లో పూర్తి చేశారు. చిత్ర నిర్మాణంలో అందుబాటులో ఉన్న ఆధునిక ఏఐ టూల్స్ను విస్తృతంగా ఉపయోగించారు. ఈ సినిమాలో పెద్ద డైలాగ్స్ లేదా భారీ యాక్షన్ కంటే విజువల్స్, నిశ్శబ్దానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. స్క్రిప్ట్ పూర్తయ్యాక ప్రతి షాట్ను ముందుగా పేపర్పై స్కెచ్ రూపంలో రూపొందించి, తర్వాత ఏఐ విజువల్ టీమ్కు ఇచ్చి దర్శకుడి ఆలోచనను వివరించారు. దీంతో సమయం, ఖర్చు రెండూ తగ్గాయన్నారు. 'మన్-పిశాచ్' చిత్రం మార్చి 18న నేరుగా యూట్యూబ్లో విడుదల కానుంది. ఈ సినిమా నిడివి సుమారు 80 నిమిషాలు.