Bellamkonda Suresh: ఫిల్మ్నగర్లో వివాదం.. నిర్మాత బెల్లంకొండ సురేష్పై కేసు నమోదు!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్పై కేసు నమోదైంది. ఫిల్మ్నగర్లోని తన ఇంటిని కబ్జా చేశారంటూ శివ ప్రసాద్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిల్మ్నగర్ రోడ్ నంబర్ 7లో తాళం వేసి ఉన్న తన ఇంటిని బెల్లంకొండ సురేష్ ఆక్రమించారని ఆయన ఆరోపించారు. ఈ ఫిర్యాదు మేరకు ఫిల్మ్నగర్ పోలీసులు బెల్లంకొండ సురేష్తో పాటు మరో వ్యక్తిపై బీఎన్ఎస్ 329(4), 324(5), 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శివ ప్రసాద్ కొంతకాలంగా తన ఇంటికి తాళం వేసి బంధువుల వద్దకు వెళ్లారు.
Details
కేసు నమోదు చేసిన పోలీసులు
అయితే మూడు రోజుల క్రితం బెల్లంకొండ సురేష్ తన అనుచరులతో కలిసి ఆ ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించారని ఆయన ఆరోపించారు. ఇంట్లోని సామాగ్రి, గోడలు ధ్వంసం చేసి, ఆ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకుని ఇంటికి తిరిగి వచ్చిన శివ ప్రసాద్ ధ్వంసమైన వస్తువులు చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. అనంతరం తన సిబ్బందిని సురేష్ ఇంటికి పంపగా, వారిపై బెల్లంకొండ సురేష్ దుర్భాషలు వాడి దాడికి యత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం బెల్లంకొండ సురేష్ సినిమా నిర్మాణ రంగంలో అంతగా చురుగ్గా లేరు.
Details
'కిష్కింధపురి' మంచి విజయాన్ని అందుకున్న సాయి శ్రీనివాస్
అయితే ఆయన కుమారులు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, బెల్లంకొండ గణేష్ చిత్రాల్లో బిజీగా ఉన్నారు. సాయి శ్రీనివాస్ వరుస విజయాలతో తన స్థాయిని నిలబెట్టుకుంటున్నారు. ఇటీవల ఆయన నటించిన 'కిష్కింధపురి' చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ విజయం తర్వాత ఆయన నాలుగు, ఐదు కొత్త ప్రాజెక్టులలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు, గణేష్ నటించిన 'స్వాతిముత్యం' సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు.