Dhanush: 'మారి 3'తో మళ్లీ మాస్ జోన్లోకి ధనుష్.. ఫ్యాన్స్కు గుడ్న్యూస్!
ఈ వార్తాకథనం ఏంటి
'ఇఫ్ యు ఆర్ బ్యాడ్.. ఐ యామ్ యువర్ డాడ్..' అంటూ 'మారి 2' సినిమాలో హీరో ధనుష్ చేసిన సందడి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 2018లో విడుదలైన ఈ చిత్రాన్ని 'మారి'కి సీక్వెల్గా దర్శకుడు బాలాజీ మోహన్ తెరకెక్కించారు. ఇందులో మాస్ అవతార్లో కనిపించిన ధనుష్.. సినీప్రియుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించారు. ఇప్పుడు ధనుష్ మరోసారి అదే మాస్ మసాలా జోన్లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. 'మారి' ఫ్రాంచైజీలో మూడో భాగాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తమిళ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 'మారి 3' కోసం దర్శకుడు బాలాజీ మోహన్కు ధనుష్ ఓ కథను సూచించినట్లు సమాచారం.
వివరాలు
స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్లు సమాచారం
ఆ కథను మరింత అభివృద్ధి చేసి పూర్తి స్థాయి స్క్రిప్ట్గా సిద్ధం చేయాలని ఆయన దర్శకుడిని కోరినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని తమిళ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే.. త్వరలోనే 'మారి 3'లో నటించే నటీనటులకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
అలాగే వచ్చే ఏడాది ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం ధనుష్ 'ఓమ్' సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత 'మారి 3'పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.