dhurandhar 2: వీడియోలు షేర్ చేయొద్దు... ధురంధర్ 2 నటుడు విజ్ఞప్తి.. పార్ట్ 3పై క్లారిటీ!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేస్తూ రికార్డుల వర్షం కురిపిస్తోంది ధురంధర్ 2. ఇప్పటికే ఈ చిత్రం రూ.750 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇందులో కీలక పాత్ర పోషించిన నటుడు రాకేశ్ బేడీ ఓ ప్రత్యేక వీడియోను సోషల్మీడియాలో పంచుకున్నారు. 'ధురంధర్'లో భాగమైనందుకు గర్వంగా ఉందని చెప్పిన ఆయన, సినిమా సన్నివేశాలకు సంబంధించిన వీడియోలను ఆన్లైన్లో షేర్ చేయవద్దని ప్రేక్షకులను కోరారు.
Details
అన్ని రికార్డులు చెరిపేసే దిశగా...
ధురంధర్2'లో భాగమైనందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ సినిమా కేవలం కొత్త రికార్డులు సృష్టించడం మాత్రమే కాదు, గత రికార్డులను కూడా పూర్తిగా చెరిపేసే స్థాయిలో ఉంది. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ప్రతి సినీ అభిమాని మనసును గెలుచుకుంది. ఇది కేవలం కమర్షియల్ హిట్ మాత్రమే కాదు, మాస్ ప్రేక్షకుల్లోనూ అపారమైన క్రేజ్ను సంపాదించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి లభిస్తున్న ఆదరణ నిజంగా అద్భుతమని రాకేశ్ బేడీ తెలిపారు.
Details
ప్రేక్షకుల అనుభూతిని కాపాడండి
ఈ సందర్భంగా ఆయన ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. "సినిమా చూస్తున్నప్పుడు వీడియోలు తీసి సోషల్మీడియాలో పోస్ట్ చేయకండి. అలా చేయడం వల్ల సినిమా చూడబోయే వారి ఉత్సుకత తగ్గిపోతుంది. ఇది సరైన పద్ధతి కాదు. సినిమా అసలైన అనుభూతి దెబ్బతింటుంది. మీరు ఎలా థ్రిల్ అయ్యారో, మిగతా వాళ్లు కూడా అలాగే ఆస్వాదించే అవకాశం ఇవ్వాలని అన్నారు.
Details
'ధురంధర్ 3'పై క్లారిటీ
ఇదిలా ఉండగా, 'ధురంధర్: ది రివెంజ్' విజయంతో 'ధురంధర్ 3' వస్తుందన్న వార్తలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని దర్శకుడు ఆదిత్య ధర్ సన్నిహిత వర్గాలు ఖండించాయి. సినిమా చివర్లో మూడో భాగానికి సంబంధించిన ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదని స్పష్టం చేశాయి. రెండు భాగాలు కలిపి దాదాపు 8 గంటల నిడివి ఉన్న భారీ కథను తెరకెక్కించిన తర్వాత దాన్ని మరింత కొనసాగించే ఆలోచన దర్శకుడికి లేదని తెలిపారు. ప్రస్తుతం ఆదిత్య ధర్ ఇతర ప్రాజెక్టులపై దృష్టి పెట్టి, వాటిని త్వరలో కార్యరూపంలోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నారని సమాచారం.