Tammareddy Bharadwaja: ఇండస్ట్రీలో ఉండలేననుకున్నా.. ఆ టైమ్లోనే ఈ సినిమా మొదలైంది: తమ్మారెడ్డి భరద్వాజ
ఈ వార్తాకథనం ఏంటి
జగపతి బాబు, లయ, హృతిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'వదలా' (Vadhala). ఆకెళ్ల వి. కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు తమ్మారెడ్డి భరద్వాజ, కిశోర్ నాయుడు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం ఈ మూవీ గ్లింప్స్ను విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, తాను సినిమాలు నిర్మించి దాదాపు 15 సంవత్సరాలు అవుతున్నాయని తెలిపారు. ఇంతకాలం తర్వాత మళ్లీ నిర్మాతగా వ్యవహరించాలంటే తొలుత భయం వేసిందని చెప్పారు. అయితే దర్శకుడు కథపై చూపించిన నమ్మకం వల్లే ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్లామని అన్నారు.
Details
రోజంతా నిరంతరం షూటింగ్
ఒక సమయంలో నాకు ఇండస్ట్రీలో మనుగడ ఉండదేమో, ఇక సినిమాల్లో కొనసాగలేనేమో అనిపించిన సమయంలో ఈ సినిమాను ప్రారంభించాం. షూటింగ్ సమయంలో అందరూ ఎంతో కష్టపడ్డారు. కొన్నిసార్లు రోజంతా నిరంతరం షూటింగ్ జరిపారు. ఈ రోజుల్లో కూడా ఇంత అంకితభావంతో పని చేసే వారు ఉన్నారా అని ఆశ్చర్యపోయాను. జగపతి బాబు లేకుండా ఈ సినిమాను ఊహించలేమని తమ్మారెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాదితో తాను సినీ పరిశ్రమలోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తవుతున్నాయని కూడా తెలిపారు.
Details
టైటిల్ సాంగ్ బాగుంది
ఇక నటుడు జగపతి బాబు మాట్లాడుతూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ''నేను ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన రోజుల్లో భరద్వాజతో ఒక సినిమా చేయాల్సి వచ్చింది. కథ ఏమిటని అడిగితే 'సినిమాలో కథ ఏమీ లేదు' అని చెప్పారు. దీంతో నేను ఆ సినిమా చేయకుండా వచ్చేశాను. తర్వాత 'అంతఃపురం' సినిమాలో నటించాను. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత 'వదలా' సినిమాతో ఆయనతో కలిసి పనిచేస్తున్నాను. ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్ను ఎన్నో వేల సార్లు విన్నాను. అలాగే లయతో స్క్రీన్ను పంచుకోవడం ఎప్పుడూ నాకు ఆనందమే'' అని చెప్పారు.