Kamal Haasan : కమల్ హాసన్ సింప్లిసిటీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. 'కల్కి 2' కోసం ఎకానమీ క్లాస్లో ట్రావెల్
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో కొనసాగుతున్న రాజకీయ, ఆర్థిక ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ సినీ పరిశ్రమపై కూడా పడుతోందని ఇటీవల పేర్కొన్న కమల్ హాసన్, ప్రొడక్షన్ ఖర్చులను తగ్గించుకోవాల్సిన అవసరాన్ని సినీ రంగానికి సూచించారు. అయితే ఆయన చెప్పిన మాటలను కేవలం సూచనలకే పరిమితం చేయకుండా స్వయంగా ఆచరణలో పెట్టి చూపించడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. తాను పాటించాలని సూచించిన పొదుపు విధానాలకు కట్టుబడి, 'కల్కి 2898 AD పార్ట్ 2' తాజా షూటింగ్ షెడ్యూల్ కోసం కమల్ హాసన్ చెన్నై నుంచి హైదరాబాద్కు ఎకానమీ క్లాస్ విమానంలో ప్రయాణించారు. సాధారణ ప్రయాణికుడిలా ఎలాంటి ఆర్భాటం లేకుండా ప్రయాణించి నేరుగా షూటింగ్ సెట్స్లో అడుగుపెట్టారు.
వివరాలు
ప్రత్యేక అభినందనలు తెలిపిన చిత్ర నిర్మాణం
సాధారణంగా స్టార్ హీరోలు ఉపయోగించే చార్టర్ విమానాలు, బిజినెస్ క్లాస్ సౌకర్యాలను పక్కనపెట్టిన ఆయన నిర్ణయం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కమల్ హాసన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ప్రత్యేకంగా అభినందించింది. విమానంలో ప్రయాణిస్తున్న కమల్ ఫొటోను సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో పంచుకుంటూ, "పరిశ్రమ కష్టకాలంలో ఉన్నప్పుడు చార్టర్ విమానాలు, విలాసవంతమైన ప్రయాణాలను వదిలి ఎకానమీ క్లాస్లో నేరుగా షూటింగ్ సెట్స్కు వెళ్లాలని నిర్ణయించుకోవడం కమల్హాసన్ లాంటి లెజెండ్కే సాధ్యమని ప్రశంసలు కురిపించింది. కొద్ది రోజుల క్రితం కమల్ హాసన్ విడుదల చేసిన బహిరంగ లేఖలో కూడా సినిమా నిర్మాణంలో ఖర్చు చేసే ప్రతి రూపాయి తెరపై కనిపించే నాణ్యత కోసం మాత్రమే వినియోగించాలన్నారు.
వివరాలు
సినీ వర్గాల నుంచి ప్రశంసలు
అయితే అదే సమయంలో సినిమా కార్మికుల వేతనాలు, భద్రత, భోజన వసతుల విషయంలో మాత్రం ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. ఇప్పుడు ఆయన స్వయంగా ఆ సూత్రాలను పాటించడం సినీ వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'కల్కి 2898 ఏడీ'లో హీరోగా ప్రభాస్ నటించగా, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించింది. ప్రస్తుతం దానికి సీక్వెల్గా 'కల్కి పార్ట్ 2' షూటింగ్ హైదరాబాద్లో వేగంగా కొనసాగుతోంది. తొలి భాగం క్లైమాక్స్లో కొద్దిసేపు మాత్రమే కనిపించిన కమల్ హాసన్, ఈసారి 'సుప్రీం యాస్కిన్' అనే శక్తివంతమైన ప్రతినాయకుడి పాత్రలో పూర్తి స్థాయిలో కనిపించనున్నారు.
వివరాలు
కొత్త షెడ్యూల్ ప్రారంభం
ఇటీవలే కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్లపై కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించిన చిత్రబృందం, ఇప్పుడు కొత్త షెడ్యూల్ను ప్రారంభించింది. ఆ షూట్లో పాల్గొనడానికే కమల్ హైదరాబాద్కు వచ్చారు. ఆయన చూపించిన నిరాడంబరత సినీ పరిశ్రమ వర్గాలనే కాకుండా సోషల్ మీడియా ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకుంటోంది.