PEDDI : రామ్ చరణ్ పెద్ది రైట్స్కు రికార్డు స్థాయి ఆఫర్లు.. రైట్స్ కోసం ఫైట్
ఈ వార్తాకథనం ఏంటి
రామ్ చరణ్, బుచ్చిబాబు సన కలయికలో రూపొందుతున్న అత్యంత ఆసక్తికర చిత్రం 'పెద్ది'. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ హక్కులు వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కీలకమైన ఈస్ట్ గోదావరి ప్రాంత పంపిణీ హక్కుల కోసం గట్టి పోటీ నెలకొంది. రామ్ చరణ్కు ఉన్న అంతర్జాతీయ స్థాయి గుర్తింపు, అలాగే బుచ్చిబాబు సన రూపొందించే చిత్రాల ప్రత్యేక శైలిపై ఉన్న విశ్వాసం కారణంగా 'పెద్ది' సినిమాకు అంచనాలకు మించిన ఆఫర్లు వస్తున్నాయి. అయినప్పటికీ ఈస్ట్ గోదావరి ప్రాంతానికి సంబంధించిన హక్కులు ఇంకా ఎవరికీ ఖరారు కాలేదని సమాచారం.
వివరాలు
ఇరు వర్గాల మధ్య చర్చలు..
దీనికి ప్రధాన కారణం ధర విషయంలో ఇంకా జరుగుతున్న చర్చలేనని తెలుస్తోంది. ఈస్ట్ గోదావరి హక్కుల కోసం నిర్మాతలు రూ.13 కోట్లకు పైగా ధరను సూచిస్తున్నారు. సినిమాపై ఉన్న భారీ అంచనాలను దృష్టిలో ఉంచుకొని ఈ రేటును నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు, కొనుగోలు దారులు సుమారు రూ.11 కోట్ల వరకు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఇరువర్గాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.
వివరాలు
రూ.13 కోట్ల వరకు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి..
సాధారణంగా ఈ రంగంలో ఉన్న డిస్ట్రిబ్యూటర్లతో పాటు, మరికొందరు కొత్త కొనుగోలు దారులు కూడా రూ.13 కోట్ల వరకు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. అయితే, ఈ హక్కులను అనుభవం ఉన్న రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లకే ఇవ్వాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నెల్లూరు ప్రాంతానికి సంబంధించిన హక్కులు కూడా దాదాపు రూ.4 కోట్లకు పైగా ధరకు వెళ్లే అవకాశముందని సమాచారం.