సుడిగాలి సుధీర్ హీరోగా కాలింగ్ సహస్ర సినిమా: చిత్ర గొంతులోంచి జాలువారిన మొదటి పాట రిలీజ్
జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పేరు తెచ్చుకున్న వారు సినిమా హీరోలుగా మారుతున్న సంగతి తెలిసిందే. అందులో సుడిగాలి సుధీర్ ఒక్కడే వరుసగా సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు. గతంలో గాలోడు సినిమాతో మంచి విజయం అందుకున్న సుధీర్, తాజాగా కాలింగ్ సహస్ర అనే సినిమాతో వస్తున్నాడు. డాలీ షా హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమా నుండి, కలయా నిజమా అనే మొదటి పాట రిలీజైంది. కె.ఎస్ చిత్ర గొంతులోంచి వచ్చిన ఈ పాట, అందరినీ ఆకట్టుకుంటోంది. కలయా నిజమా, కలవరమేమో బహుశా.. కదిలే కథగా తోచేనుగా ఈ వరుసా.. అంటూ సాగే ఈ పాటకు సాహిత్యాన్ని లక్ష్మీ ప్రియాంక అందించారు.
ఆకట్టుకుంటున్న మోహిత్ సంగీతం
అబ్బాయిపై తన మనసులో ఉన్న ప్రేమ తనకే మొదటిసారి అర్థమయితే మనసులో కలిగే అల్లరి ఎలా ఉంటుందో ఈ పాటలో చూపించారు. మోహిత్ రహమానియాక్ స్వరపరిచిన ఈ పాట, ఆద్యంతం అందంగా ఉంది. లిరికల్ వీడియోలో కనిపించిన దృశ్యాలు, పాట మీద ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. షాడో మీడియా ప్రొడక్షన్, రాధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న కాలింగ్ సహస్ర సినిమాను విజేష్ కుమార్ తాయల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అరుణ్ విక్కిరాల దర్శకత్వం వహిస్తున్నారు. మరి కాలింగ్ సహస్ర సినిమాతో సుడిగాలి సుధీర్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.