Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కీలక మలుపు.. ఏ-11గా అల్లు అర్జున్
ఈ వార్తాకథనం ఏంటి
'పుష్ప 2' సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. మొత్తం 23 మందిపై అభియోగాలు మోపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసు ఛార్జిషీట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను ఏ-11 నిందితుడిగా చేర్చారు. అలాగే సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ను ఏ-1గా పేర్కొన్నారు. అల్లు అర్జున్తో పాటు ఆయన మేనేజర్, వ్యక్తిగత సిబ్బంది, ఎనిమిది మంది బౌన్సర్లపై కూడా అభియోగాలు నమోదు చేశారు.
Details
యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రధాన కారణం
పోలీసుల దర్యాప్తు ప్రకారం.. థియేటర్ యాజమాన్యం చేసిన నిర్లక్ష్యమే ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణమని నిర్ధారించారు. సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, జనసమూహ నియంత్రణలో వైఫల్యం చోటుచేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పినట్లు ఛార్జిషీట్లో పేర్కొన్నారు. 2024 డిసెంబర్ 4న 'పుష్ప 2' ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో 35 ఏళ్ల రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ (9) తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై అప్పట్లో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తాజాగా ఆ దర్యాప్తు పూర్తిచేసి ఛార్జిషీట్ను కోర్టులో సమర్పించారు.