
Zubeen Garg: జుబీన్ గార్గ్ మృతి కేసులో మేనేజర్ సిద్ధార్థ శర్మ అరెస్టు!
ఈ వార్తాకథనం ఏంటి
అస్సాం కి చెందిన ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ (52) ఇటీవల సింగపూర్లో ప్రమాదవశాత్తూ మృతిచెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆదేశాల మేరకు దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ చీఫ్ ఆర్గనైజర్ శ్యామ్కాను మహంత, జుబీన్ గార్గ్ మేనేజర్ సిద్ధార్థ శర్మలను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు.
Details
ఈవెంట్ ఆర్గనైజర్ ఇళ్లలో సోదాలు
మహంతను దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద, శర్మను గురుగ్రామ్లోని ఓ అపార్ట్మెంట్లో అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వీరిద్దరినీ గువాహటికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) జుబీన్ మేనేజర్, ఈవెంట్ ఆర్గనైజర్ ఇళ్లలో సోదాలు నిర్వహించింది. అదనంగా సౌండ్ రికార్డిస్ట్ నివాసంలోనూ తనిఖీలు జరిగాయి. ఈ కేసులో ముందే మ్యుజీషియన్ శేఖర్ జ్యోతి గోస్వామిని అదుపులోకి తీసుకున్నారు. జుబీన్ మరణానికి ముందు ప్రయాణించిన నౌకలో గోస్వామి కూడా ఉన్నారని పోలీసులు గుర్తించారు, అందుకే అతడిని అదుపులోకి తీసుకున్నారు.