కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథ కోసం మెగా హీరో
ఈ మధ్య వరుస పరాజయాలు మూటగట్టుకున్న కిరణ్ అబ్బవరం, తాజాగా వినరో భాగ్యము విష్ణు కథ అనే మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తిరుపతిలో నివసించే ఒక కుర్రాడి ప్రేమ జీవితంలో ఎలాంటి మలుపులు తిరిగాయన్నదే ఈ సినిమా కథ అని ఇదివరకు రిలీజైన టీజర్ చూస్తే అర్థమైపోయింది. అలాగే మురళీ శర్మతో చేయించిన కామెడీ సినిమాలో ప్రధాన ఆకర్షణగా ఉంటుందని కూడా తెలుస్తోంది. ఐతే ఈ సినిమా ట్రైలర్ కోసం మెగా హీరో రాబోతున్నాడు. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, వినరో భాగ్యము విష్ణు కథ ట్రైలర్ ని లాంచ్ చేయబోతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ జీఏ2 ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.
సమంత శాకుంతలం సినిమాకు పోటీగా వినరో భాగ్యము విష్ణు కథ
ట్రైలర్ ని సాయి ధరమ్ తేజ్ రిఈజ్ చేయబోతున్నాడని చిన్నపాటి గ్లింప్స్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ఫిబ్రవరి 7వ తేదీన సాయంత్రం 5:04గంటలకు ట్రైలర్ ని రిలీజ్ చేస్తారట. ఈ సినిమాలో కశ్మీర పరదేసి హీరోయిన్ గా నటిస్తోంది. జీఏ2 సినిమాస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు బన్నీవాసు నిర్మాతగా వ్యవహరిస్తుండగా, మురళీ కృష్ణ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. మురళీశర్మ, ప్రవీణ్, ఆమని, శుభలేఖ సుధాకర్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే అదేరోజున సమంత నటించిన శాకుంతలం కూడా రిలీజ్ అవుతోంది.